నోయిడాలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు దీపక్. హాస్టల్లో ఒకే గదిలో ఆగ్రాకు చెందిన దేవాన్ష్ చౌహాన్తో కలిసి ఉంటున్నాడు. ఇద్దరి మధ్య గొడవ మొదలైందని, రూమ్లో నుంచి కాల్పుల శబ్ధం వినిపించిందని సెక్యూరిటీ గార్డ్ హాస్టల్ వార్డెన్కు సమాచారం ఇచ్చాడు.
ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో తెలుగు విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు.. ఆ విద్యార్థిని కాల్చిచంపిన రూమ్మెట్ కూడా ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. దీపక్ హత్య తర్వాత తానూ కాల్చుకుని దేవాన్ష్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన నోయిడాలోని నాలెడ్జ్ పార్క్లోని ఒక ప్రైవేట్ హాస్టల్ గదిలో చోటుచేసుకుంది. మరణించిన వారు ఇద్దరూ కూడా స్నేహితులని పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. ఏపీ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మాజీ కౌన్సిలర్ దివ్వెల రత్తయ్య కుమారుడు దీపక్ నోయిడాలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. హాస్టల్లోని ఒక గదిలో ఆగ్రాకు చెందిన దేవాన్ష్ చౌహాన్తో కలిసి దీపక్ ఉంటున్నాడు. మంగళవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో.. ఇద్దరి మధ్య గొడవ మొదలైందని, రూమ్లో నుంచి కాల్పుల శబ్ధం వినిపించిందని సెక్యూరిటీ గార్డ్ హాస్టల్ వార్డెన్కు సమాచారం ఇచ్చాడు. సిబ్బంది బాల్కనీ నుంచి వెళ్లి కిటికీ అద్దాలు పగులగొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి దీపక్, దేవాన్ష్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించారు. తలలో బుల్లెట్ దిగడంతో దీపక్ అక్కడిక్కడే మరణించాడు. మరో విద్యార్థి దేవాన్ష్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ బుధవారం చనిపోయాడు. దీపక్ మరణ వార్త విని చిలకలూరిపేట మాజీ కౌన్సిలర్ దివ్వెల రత్తయ్య కుటుంబ సభ్యులు నోయిడాకు వెళ్లారు.
నాలెడ్జ్ పార్క్-IIIలోని RCI విద్యా విహార్ హాస్టల్లో ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన దీపక్ కుమార్ (22), ఆగ్రాకు చెందిన దేవాన్ష్ చౌహాన్ (23) అనే ఇద్దరు విద్యార్థులు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ (బిమ్టెక్)లో PGDM ప్రోగ్రామ్లో చేరారు. ఇద్దరూ కూడా ఒకే హాస్టల్ గదిలో ఉంటున్నట్లు తెలుస్తోంది.. ఈ క్రమంలో మంగళవారం ఇద్దరి మధ్య గొడవజరిగిందని హాస్టల్ నిర్వాహకులు పేర్కొంటున్నారు. దేవాన్ష్ చౌహాన్.. దీపక్ ను కాల్చి.. అనంతరం చనిపోయాడని పోలీసులు తెలిపారు.
రెండు బుల్లెట్లు ఒకే లైసెన్స్ గల రివాల్వర్ నుంచి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. తుపాకీ పూర్తిగా లోడ్ చేసి ఉందని.. అది చౌహాన్ తండ్రి సురేందర్ సింగ్ చౌహాన్ కు చెందినదని తెలిపారు. ఆయన ఆగస్టు 31న యుపి ఎస్టీఎఫ్ లో సర్కిల్ ఆఫీసర్ గా పదవీ విరమణ చేశారు. గత శనివారం తన తండ్రి వీడ్కోలు పార్టీకి హాజరయ్యేందుకు ఇంటికి వెళ్ళిన చౌహాన్, మంగళవారం ఉదయం తన హాస్టల్ కు బయలుదేరినప్పుడు తుపాకీని దొంగచాటుగా తీసుకెళ్లాడని తెలిపారు. సంఘటన జరగడానికి కేవలం రెండు గంటల ముందే చౌహాన్ హాస్టల్కు చేరుకున్నాడని.. ఆ తర్వాత ఈ ఘటన జరిగినట్లు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.