అమరావతి నిధుల వేటలో ఏపీ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. నవ్యాంధ్ర రాజధానికి రుణం అందించేందుకు హడ్కో ముందుకు వచ్చింది. ఈ నిధులతో ప్రభుత్వం ఏమేం పనులు చేయబోతోంది? రుణాన్ని తిరిగి ఎలా చెల్లిస్తుంది? ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆకాశమే హద్దుగా.. అమరావతి పరుగులు పెడుతోంది. వీలైనన్ని మార్గాల ద్వారా నిధులు సేకరించి వడివడిగా పనులు చేపట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికే కేంద్రప్రభుత్వంతో పాటు పలు బ్యాంక్లు, సంస్థల నుంచి రుణాలు తీసుకొస్తోంది. తాజాగా మరో సంస్థతో సీఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. హడ్కో నుంచి 11 వేల కోట్ల రుణం అమరావతి రాజధానికి లభించబోతోంది. ఉండవల్లిని సీఎం నివాసంలో ఈ మేరకు సీఆర్డీఏతో హడ్కో ఒప్పందం చేసుకుంది. దీంతో త్వరలోనే అమరావతికి 11వేల కోట్ల సాయం అందనుంది. ఈ నిధులను అమరావతిలో పలు కీలక పనులకు ఉపయోగించబోతోంది ఏపీ ప్రభుత్వం.
అమరావతి రాజధాని నిర్మాణం కోసం.. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు గతంలోనే ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఈ ఏడాది జనవరి 22న ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధులు మంజూరుకు హడ్కో అంగీకారం తెలిపింది. తాజాగా నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం కుదిరింది. అమరావతిని వేగంగా అభివద్ధి చేసి.. తద్వారా సంపదను సృష్టించి.. రుణాల్ని తిరిగి చెల్లించడమే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలనే లక్ష్యంతో చంద్రబాబు సర్కారు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా గతంలో పలు సంస్థలకు కేటాయించిన భూముల విషయంలో ఇటీవలే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 30వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు కూడా పూర్తయ్యాయి.