తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీగోవిందరాజస్వామి ఆలయ సమీపంలో మంటలు చెలరేగాయి. ఆలయం సమీప గోపురం ముందున్న షాపులకు మంటలు అంటుకున్నాయి. అవి క్రమంగా షాప్ మొత్తం విస్తరించడంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఈ క్రమంలో ఆలయం ముందున్న చలువ పందిళ్లకు మంటలు అంటుకున్నాయి. రెండు షాపులు గద్ధమయ్యాయి. భారీ అగ్ని కీలలు ఎగిసిపడటంతో స్థానికులతోపాటు భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
బుధవారం(జూలై 03) తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో చలువ పందిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్పాట్కి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే, ఈలోపే షాపులో సామగ్రి, చలువ పందిళ్లు పూర్తిగా కాలిపోయాయి. భక్తులు పెద్దగా లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఓ దుకాణంలో విద్యుదాఘాతం కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించినట్టు అధికారులు గుర్తించారు.