హైదరాబాద్లో డ్రగ్స్ తీసుకున్నట్టు అంగీకరించిన 14 మంది శిక్షకు బదులుగా చికిత్సను ఎంచుకున్నారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారు. తెలంగాణ పోలీసుల EAGLE టీమ్.. తెలిపిన ప్రకారం.. వీరంతా గవర్నమెంట్ గుర్తింపు పొందిన డీ-అడిక్షన్ కేంద్రాల్లో చికిత్సకు ముందుకు వచ్చారు. వారు కావాలనుకున్నది శిక్ష రద్దు కాదు, తమ తప్పును ఒప్పుకుని జీవితాన్ని మార్చుకునే అవకాశం అని పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు.
చిన్న మొత్తంలో డ్రగ్స్ తీసిన వారి కోసం… NDPS చట్టంలోని 64-A సెక్షన్ ఒక మార్గం చూపుతోంది. వ్యసనానికి లోనైనవారు తమపై కేసులు ఉన్నా సరే.. వాలంటరీగా చికిత్స కోరితే, శిక్ష నుంచి మినహాయింపు లభిస్తుంది. కానీ ఇక్కడో కండీషన్ ఉంది. తప్పకుండా పూర్తి చికిత్స తీసుకోవాలి. మధ్యలో ఆపేస్తే మళ్లీ కేసు రీఓపెన్ అవుతుంది.
ఇప్పుడు ఈ 14 మంది నెలరోజులపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన పునరావాస కేంద్రాల్లో చికిత్స పొందనున్నారు. డ్రగ్స్ను మానడం ఒక స్టెప్ మాత్రమే కాదు… పూర్తిగా జీవనశైలిని మార్చే ప్రయాణం అని మానిసిక నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం వ్యక్తిగత మార్పు కాదు, సమాజానికి పంపే శక్తివంతమైన సందేశం అంటున్నారు. ఒకసారి ఓ తప్పు చేశామంటే జీవితాంతం శిక్షించాల్సిన అవసరం లేదు. వారు తప్పు గుర్తించి మారాలంటే… చట్టమే రక్షణగా నిలబడుతుంది అన్నది పోలీసులు చెబుతున్న మాట.