కేరళా తీరాన్ని తాకిన నైరుతు రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తర కర్ణాటకాలో ఏర్పడిన అల్పపీడనం నెమ్మదిగా తూర్పు వైపుకు కదులుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
కేరళా తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తూ పశ్చిమ మధ్య తూర్పు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు కర్ణాటక, గోవా, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఇవి వాతావరణానికి అనుకులంగా చురుగ్గా కదులుతుండంతో ఉత్తర బంగాళాఖాతంలోని మిజోరాం, మణిపూర్, నాగాలాండ్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఈ నైరుతి రుతుపవనాల కారణంగా ఉత్తర కర్ణాటకాలో ఏర్పడిన అల్పపీడనం నెమ్మదిగా తూర్పు వైపుకు కదులుతూ క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక మరోవైపు తూర్పు మధ్య అరేబియా సముద్రం నుండి ఉత్తర ఒడిశా, మధ్య మహారాష్ట్ర, ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా సముద్రమట్టానికి 1.5 నుండి 4.6 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు దక్షిణ భారత దేశంతో పాటు ఉత్తర భారత్లోని కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ వాఖ తెలిపింది.
వాతావరణశాఖ ప్రకారం ఈరోజు తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు మే 31, లేదా జూన్ 1 న ఈ నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశించనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు రాష్ట్రంలో ఇవాళ సాధారణ ఉష్ణోగ్రతలు నమోదుకానున్నాయి. ఈ రోజు గరిష్టంగా నల్లగొండ లో 36.5, కనిష్టంగా హైదరాబాద్, మెదక్ లలో 31.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. రాగల మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు నుండి ఏడు డిగ్రీలు తక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీకి రానున్న మూడు రోజుల పాటు వర్ష సూచన…
ఇక కేరళా తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు ఇవాళ రాయలసీమలోకి ప్రవేశించనున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో పశ్చిమమధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ వాఖ హెచ్చరికలు జారీ చేసింది.
వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్. గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, పార్వతీపురంమన్యం, విశాఖ పట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక మంగళవారం విషయానికొస్తే అల్లూరి సీతారామ రాజు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షా లు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగితా జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ వాఖ సూచించింది. వర్షాలు కురుస్తున్న వేళ ఎవరూ సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.