శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బ్యాంకాక్ నుంచి ఓ ప్లైట్ వచ్చింది. అయితే ఆ విమానం దిగిన ఓ యువతి అనుమానాస్పదంగా ప్రవర్తిస్తుంది. కాసేపు గమనించిన అధికారులు వెంటనే ఆమె అదుపులోకి తీసుకున్నారు. వివరాలు అడిగిన తర్వాత.. తన లగేజ్ తనిఖీ చేశారు …
హైదరాబాద్కు చెందిన 23 ఏళ్ల యువతి సోమవారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. బ్యాంకాక్ నుంచి అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా, ఆమెను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. 3.1 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని ఆమె బ్యాగులో దాచిపెట్టినట్లు గుర్తించారు. ఈ గంజాయిని నాలుగు ప్యాకెట్లలో కట్టి రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ డ్రగ్స్ విలువ దాదాపు రూ 3 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
నిందితురాలు ఇండిగో విమానం 6E-1068 ద్వారా శంషాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి వచ్చింది. అయితే ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించడంతో.. భద్రతా సిబ్బంది ఆపి.. బ్యాగులను తనిఖీ చేశారు. దీంతో 3.1 కిలోల గంజాయి దొరికింది. ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు ప్రస్తుతం కేసు పై మరింత దర్యాప్తు చేస్తున్నారు. ఆమె గతంలో కూడా ఇలా గంజాయి రవాణా చేసిందా..? దీని వెనక ఏదైనా పెద్ద నెట్ వర్క్ ఉందా అనే కోణాల్లో అధికారులు విచారణ జరుపుతున్నారు.