ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్ 2026) పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ తాజాగా ప్రారంభమైంది..
దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్ 2026) పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ తాజాగా ప్రారంభమైంది. ఇటీవల కొత్త షెడ్యూల్ విడుదల చేసిన ఐఐటీ గువాహటి ఈ మేరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. సెప్టెంబర్ 28, 2025వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గేట్ 2026లో కొత్తగా ఇంజినీరింగ్ సైన్సెస్ (XE) కింద ఎనర్జీ సైన్స్(XE-I) పేపర్ను కూడా ప్రవేశపెట్టారు. దీంతో గేట్ పేపర్ల సంఖ్య మొత్తం 30కి చేరింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గరిష్ఠంగా 2 పేపర్ల వరకు అప్లై చేసుకోవచ్చు. అయితే ఒక్కో టెస్ట్ పేపర్కు విడిగా దరఖాస్తు ఫీజు చెల్లించవల్సి ఉంటుంది.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులైతే ఒక్కో పేపర్కు రూ.1000, ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్ధులు రూ.2000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కేటగగిరీ, టెస్ట్ పేపర్, ఎగ్జామ్ సిటీ మార్పు, కొత్త టెస్ట్పేపర్ జతచేసుకోవడం వంటి ఇతర మార్పులకు నవంబర్ 6 వరకు అవకాశం ఉంటుంది. ఇక గేట్ 2026 రాత పరీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తారు. అడ్మిట్ కార్డులను జనవరి 2నుంచి అందుబాటులోకి తీసుకువస్తారు. ఆన్లైన్ విధానంలో జరిగే ఈ పరీక్ష మూడు గంటల పాటు జరగనుంది. గేట్ 2026 ఫలితాలు మార్చి 19న విడుదల చేస్తారు. స్కోర్ కార్డులను మార్చి 27 నుంచి మే 31 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
గేట్ 2026 ప్రవేశ పరీక్ష ఎలా ఉంటుందంటే..
గేట్ ప్రవేశ పరీక్ష మొత్తం 100 మార్కులకు 65 ప్రశ్నలకు మూడు గంటల పాటు ఉంటుంది. జరుగుతుంది. నెగటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు జవాబుకు 33.33 శాతం మార్కుల కోత విధిస్తారు. ఒక మార్కు ప్రశ్నకు 1/3, రెండు మార్కుల ప్రశ్నకు 2/3 చొప్పున మార్కుల కోత ఉంటుంది. గేట్ 2026 పరీక్షలో వచ్చిన స్కోరు పీజీ ప్రవేశానికి మూడు ఏళ్లు, పీఎస్యూల్లో నియామకానికి రెండేళ్ల వరకు చెల్లుబాటు అవుతుంది. ఇతర వివరాలను అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు.