భానుడి భగభగలు చూసి మే నెల వచ్చిందా అని చూస్తే… క్యాలెండర్ ఇంకా మార్చి కూడా దాటలేదు. అప్పుడే భాస్కరుడు బెంబేలెత్తిస్తున్నాడు. బయటకొచ్చారా… మాడు పగిలిపోద్ది అంటూ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాడు. ఇప్పుడే ఏమైంది.. UV రేస్తో ముందుంది మరింత మంట అంటున్నాడు. అసలీ UV కిరణాల కథేంటి..? తెలుగు రాష్ట్రాలపై వాటి ప్రభావం ఎలా ఉండబోతోంది…?
వేసవి కాలం హడలెత్తిస్తోంది.. ఈసారి ఫిబ్రవరి నుంచే ఫుల్ ఫైర్ మీదున్నాడు భానుడు. ఉదయం తొమ్మిది గంటల నుంచే దంచికొడుతున్నాడు. సాయంత్రమైనా భూమి సెగలు.. పొగలు కక్కుతుందంటే టెంపర్ ఏ స్థాయిలో నమోదవుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇప్పట్నుంచే వణికిస్తున్న ఈ ఎండలకు కొత్తగా యూవీ రేస్.. అదే అతినీలలోహిత కిరణాల ఎఫెక్ట్ కూడా ఉంటుందంటున్నారు వాతావరణశాఖ అధికారులు. ఇప్పటికే కేరళను వణికిస్తున్న ఆ కిరణాలు.. తెలుగు రాష్ట్రాలపైనా విరుచుకుపడొచ్చంటూ వార్నింగ్ బెల్స్ మోగిస్తున్నారు.
కేరళలో అతినీల లోహిత కిరణాలు తీవ్రరూపం దాల్చాయి. వాతావరణ కాలుష్యం, ఓజోన్ పొరకు రంధ్రాలు వంటి కారణాలతో యూవీ ఇండెక్స్ అత్యంత ప్రమాదకర కేటగిరీలోకి చేరింది. పలుచోట్ల యూవీ ఇండెక్స్ 11 పాయింట్లు దాటేసింది. దీంతో కేరళలకు చుక్కులు చూపిస్తున్నాడు సూర్యుడు. అత్యవసరమైతే తప్పా ఎవ్వరూ బయటకు రావొద్దంటూ కేరళ విపత్తు నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ ప్రకటించింది. యూవీ కిరణాల ఎఫెక్ట్తో చర్మ సంబంధిత వ్యాధులు, ఐ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు… స్కిన్ క్యాన్సర్ వచ్చే చాన్స్ కూడా ఉందని చెబుతున్నారు.
అందుకే.. ప్రజలు అతినీలలోహిత కిరణాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దీని ప్రభావం ఉంటుందని.. అతినీలలోహిత కిరణాల బారినపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలపై కూడా ప్రభావం..
ఈ యూవీ రేస్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపైనా లేకపోలేదంటున్నారు వాతావరణశాఖ అధికారులు. మే మధ్యలో ఉండాల్సిన టెంపరేచర్ మార్చిలోనే నమోదవుతుందంటే.. చాలా జాగ్రత్తగా ఉండాల్సిందేనంటున్నారు. అత్యవసరమైతే తప్పా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు రాకపోవడమే మంచిదని సూచిస్తున్నారు.
ఇక ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు నిప్పుల గుండంగా మారిపోయాయి. తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైనే నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనైతే ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఇకరానున్న రెండు, మూడు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 నుంచి 45 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో ఎండ తీవ్రతతోపాటు వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. ఈ జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అటు ఏపీలోనూ 40 డిగ్రీలపైనే టెంపరేచర్ నమోదవుతోంది.
మొత్తంగా… ఎప్పటిలా కాదు ఈసారి ఎండలు వెరీ డేంజర్ అంటున్నారు అధికారులు. యూవీ కిరణాల ఎఫెక్ట్ పడే అవకాశం కూడా ఉండటంతో వెరీ కేర్ఫుల్గా ఉండాలని సూచిస్తున్నారు.