దేశ రక్షణ వ్యవస్థలోకి మరో సరికొత్త క్షిపణి వ్యవస్థ అడుగుపెట్టింది. డ్రోన్ విధ్వంసక సూక్ష్మ క్షిపణి వ్యవస్థ ‘భార్గవాస్త్రను భారత్ విజయంతంగా పరీక్షించింది. డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు భారత్ ఈ వ్యవస్థ రూపొందించింది. గోపాల్పూర్లోని సీవార్డ్ ఫైరింగ్ రేంజ్ నుంచి దీనిని విజయవంతంగా పరీక్షించారు ఎయిర్ ఫోర్స్ అధికారులు. ఇది ఫిక్స్ చేసిన టార్గెట్లను విజయవంతంగా చేరుకుందని అధికారులు వెల్లడించారు.
భార్గవాస్త్ర అనేది సూక్ష్మ క్షిపణి ఆధారిత కౌంటర్-డ్రోన్ సిస్టమ్, ఇది డ్రోన్ల నుండి వచ్చే ముప్పును ఎదుర్కోవడానికి రూపొందించబడింది. ఈ బార్గవాస్త్ర రక్షణ రంగంలో భారతదేశం స్వావలంబనను మరింత బలోపేతం చేస్తుంది. హార్డ్ కిల్ మోడ్లో రూపొందించబడిన ఈ భార్గవస్త్ర 2.5 కి.మీ దూరంలో ఉన్న డ్రోన్లను గుర్తించి వాటిని నాశనం చేస్తోంది. మే 13న గోపాల్పూర్లో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ (AAD) సీనియర్ అధికారుల సమక్షంలో ఈ రాకెట్ కోసం మూడు పరీక్షలు జరిగాయి. ఒక్కొక్క రాకెట్ను ప్రయోగించడం ద్వారా రెండు పరీక్షలు నిర్వహించారు. 2 సెకన్లలోపు రెండు రాకెట్లను సాల్వో మోడ్లో ప్రయోగించడం ద్వారా ఒక ట్రయల్ నిర్వహించబడింది. నాలుగు రాకెట్లు ఆశించిన విధంగా పనిచేశాయని, అవసరమైన ప్రయోగ పరిమితులను సాధించాయని, పెద్దఎత్తున డ్రోన్ల దాడుల ప్రభావాన్ని తగ్గించడంలో ఇది సమర్థవంతంగా పనిచేసిందని అధికారులు తెలిపారు.
భారత రక్షణ దళాలు శత్రువుల నుంచి డ్రోన్ దాడులను దీటుగా ఎదుర్కొనేందుకు ఈ భార్గవాస్త్రను అభివృద్ధి చేశారు. ఇది 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న శత్రు వాహనాలను గుర్తించి, గైడెడ్ మైక్రో బాంబుల ద్వారా వాటిని నిర్వీర్యం చేయగలదు. అయితే ఇది డ్రోన్ల నుండి వచ్చే ముప్పును ఎదుర్కోవడమే కాకుండా, ఆయుధాలతో కూడిన డ్రోన్లను కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ఈ వ్యవస్థను నాగ్పూర్కు చెందిన సోలార్ గ్రూప్ దాని అనుబంధ సంస్థ ఎకనామిక్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ (EEL) అభివృద్ధి చేసింది.