విజయనగరం జిల్లా కేంద్రంగా వెలుగులోకి వచ్చిన ఐసిస్ ఉగ్రకుట్ర కేసు మరోసారి కలకలం రేపింది. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు మరొక కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బీహార్ రాష్ట్రానికి చెందిన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తలిబ్ను ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న అబూ తలిబ్ను ఎన్ఐఏ సిబ్బంది అత్యంత చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో ఇప్పటివరకు పలువురిని విచారణ కోసం అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా అరెస్టైన ఆరిఫ్ హుస్సేన్ ఈ కుట్రకు ప్రధాన సూత్రధారుల్లో ఒకడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్ఐఏ విచారణలో బయటపడ్డ ప్రాథమిక సమాచారం ప్రకారం ఇతను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తూ, ఆన్లైన్ ద్వారా ఆర్థిక సహాయం, వ్యూహాత్మక సమాచారం పంచుకున్నట్లు తెలుస్తోంది. ఎన్ఐఏ అధికారులు ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని, దేశ భద్రతకు ముప్పు కలిగించే ప్రతి లింకును వెలికి తీసేందుకు ముమ్మర కసరత్తు చేశారు. ఇటీవలే విజయనగరంలో జరిగిన దాడుల్లో అనేక పత్రాలు, డిజిటల్ పరికరాలు, అనుమానాస్పద డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆధారాలనే ఆధారంగా చేసుకొని మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవైపు దేశానికి ఉగ్రవాద ముప్పు పెరుగుతున్న తరుణంలో, ఈ కేసు చుట్టూ నెలకొన్న పరిస్థితులు మరింత ఉత్కంఠ కలిగిస్తున్నాయి. ఆరిఫ్ హుస్సేన్ అరెస్టుతో దర్యాప్తు కీలక దిశలో ముందుకు వెళ్లనుందని అధికారులు చెబుతున్నారు. ఈ పరిణామంతో విజయనగరం మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ సైతం ఉలిక్కిపడింది. మున్ముందు ఈ కేసులో ఇంకెంత మంది అదుపులోకి రానున్నారో అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది.. అయితే సిరాజ్, సమీర్లు సుమారు రెండు నెలలకు పైగా సెంట్రల్ జైల్లో ఉండగా వీరు ఇచ్చిన సమాచారం ఇప్పుడు కీలకంగా మారింది. అయితే ప్రస్తుతం పట్టుబడ్డ తలిబ్ను ఎన్ఐఏ అధికారులు శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.