ఏపీలో మామిడిపై రాజకీయ రచ్చ కొనసాగుతోంది. రైతుల ఇబ్బందులు తెలుసుకునేందుకు నేరుగా రంగంలోకి దిగేందుకు వైసీపీ అధినేత ఇవాళ చిత్తూరు వెళ్తున్నారు. బంగారుపాళ్యం మామిడిమార్కెట్ను జగన్ సందర్శించనున్నారు. జగన్ పర్యటనకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది పోలీస్ శాఖ. మ్యాంగో మార్కెట్లో 500 మందికి మాత్రమే అనుమతించారు. హెలిప్యాడ్ దగ్గరకు 30 మందికి మాత్రమే అనుమతిచ్చారు పోలీసులు. రోడ్షోలు, ఇతర కార్యక్రమాలకు అనుమతి లేదన్నారు ఎస్పీ. షరతులు ఉల్లంఘిస్తే రౌడీషీట్లు తెరుస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
పోలీస్ ఆంక్షలపై వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. విపరీతమైన ఆంక్షలు పెట్టి వైసీపీ కేడర్ను భయపెడుతున్నారని వైసీపీ నేత భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్సల్స్ను గాలించినట్లు వైసీపీ నేతలు గాలిస్తున్నారని మండిపడ్డారు. జగన్ పర్యటనను అడ్డుకోవడానికి రౌడీషీట్ తెరుస్తామని ఎస్పీ బెదిరిస్తున్నారని భూమన కరుణాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే మామిడి రైతుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం, మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కేవలం రాజకీయం కోసమే.. జగన్ పర్యటనలు అంటూ విమర్శిస్తుంది. కేంద్ర సహకారం కోసం ఎదురుచూడకుండా ప్రభుత్వమే మూడున్నర లక్షల టన్నులు కొనుగోలు చేస్తే వైసీపీ రాజకీయం చేస్తుందని విమర్శించారు ఏపీ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెంనాయుడు.
చిత్తూరు మామిడి రైతు కష్టాలు ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏడాది నుంచి సాగుచేసి.. పంట చేతికొచ్చే సమయానికి గిట్టుబాటు ధర దొరక్కపోతే ఉండే బాధ వర్ణనాతీతం. రెక్కల కష్టానికి ఫలితం దక్కకపోవడంతో మామిడి రైతు ఆందోళనబాట పట్టాడు. దీంతో మామిడి రైతు సమస్యను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లింది. అయితే రైతుల ఆందోళనకు ప్రత్యక్షంగా మద్దతు తెలిపేందుకు వైసీపీ చీఫ్ చిత్తూరు వెళ్లేందుకు రెడీ అవడంతో విషయం పొలిటికల్ టర్న్ తీసుకుంది. జగన్ పర్యటనలో నిబంధనలు అతిక్రమించిన వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని ఎస్పీ వార్నింగ్ ఇవ్వడం.. దానికి వైసీపీ కౌంటర్ ఇవ్వడంతో విషయం మరింత హీట్ ఎక్కింది.