ఎట్టకేలకు జమ్మికుంట వాసుల కోరిక నెరవేరింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషితో జమ్మికుంట ప్రజలకు గుడ్ న్యూస్ చెబుతూ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మికుంట రైల్వే స్టేషన్లో మరో మూడు రైళ్లను ఆపేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.
కరీంనగర్ ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన విజ్ఞప్తి మేరకు.. జమ్మికుంట రైల్వే స్టేషన్లో మరో మూడు రైళ్లను ఆపేందుకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ప్రాంత ప్రయాణీకులకు మెరుగైన రవాణా సౌకర్యం లభించనుంది.
ఏయే రైళ్లు ఆగనున్నాయి?
ఇకపై జమ్మికుంట స్టేషన్లో ఆగనున్న రైళ్లు ఇవే:
దక్షిణ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ : హైదరాబాద్ నుండి హజ్రత్ నిజాముద్దీన్కు వెళ్లే ఈ రైలు రాత్రి 1:34 గంటలకు జమ్మికుంట చేరుకుంటుంది.
దక్షిణ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ : హజ్రత్ నిజాముద్దీన్ నుండి హైదరాబాద్కు వెళ్లే ఈ రైలు రాత్రి 11:19 గంటలకు జమ్మికుంటలో ఆగుతుంది.
రాయపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్: సికింద్రాబాద్ నుండి రాయపూర్కు వెళ్లే ఈ రైలు రాత్రి 1:04 గంటలకు జమ్మికుంటకు చేరుకుంటుంది.
ఈ మూడు రైళ్లూ జమ్మికుంటలో కేవలం ఒక నిమిషం పాటు ఆగుతాయి. ఈ రైళ్లు ఏ రోజు నుంచి నిలవనున్నాయనే వివరాలతో దక్షిణ మధ్య రైల్వే శాఖ ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
బండి సంజయ్ కృషితో సాకారమైన డిమాండ్
జమ్మికుంటలో రైళ్లు నిలవాలనేది ఈ ప్రాంత ప్రజల చాలా కాలం డిమాండ్. దీనిని దృష్టిలో ఉంచుకుని బండి సంజయ్ కుమార్ పలుమార్లు రైల్వే ఉన్నతాధికారులను, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను స్వయంగా కలిసి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఆయన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కార్యాలయానికి తెలియజేసింది.
బండి సంజయ్ హర్షం..
ఈ నిర్ణయంపై బండి సంజయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. దీని వల్ల కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు.