జూబిలీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా పనిచేస్తున్న నేతకే జూబిలీహిల్స్ టికెట్ దక్కుతుదని ఆయన స్పష్టం చేశారు. స్థానిక కాగ్రెస్ నేత అజారుద్దీన్తో కలిసి ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఎవరి పేరు ఫైనల్ చేస్తారనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని పొన్నం ప్రభాకర్ అన్నారు. సర్వేలు, అంతర్గత వ్యవహారాలు చూసుకుని అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఇతర నియోజకవర్గాల నేతలకు ఇక్కడ ఛాన్స్ లేదని పొన్నం స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్ టికెట్ కోసం కాంగ్రెస్లో ఇప్పటికే గట్టి పోటీ నెలకొంది. అజారుద్దీన్, అంజన్ యాదవ్, నవీన్ యాదవ్తోపాటు మేయర్ విజయలక్ష్మి, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి ప్రయత్నాలు మొదలు పెట్టారు. పోటీకి మరికొందరు సీనియర్లు సైతం ఉత్సాహం చూపుతున్నారు. గత ఎన్నికల్లో జూబిలీహిల్స్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు అజారుద్దీన్. ఈసారి జూబిలీహిల్స్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. జూబిలీహిల్స్ నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని అన్నారు.
అనారోగ్యంతో ఇటీవల జూబిలీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిచెందడంతో.. ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. సానుభూతి కోణంలో ఇతర పార్టీలు పోటీపెట్టకూడదన్న సంప్రదాయాలు పక్కకుపోయి చాలారోజులైంది కాబట్టి… అక్కడ బైపోల్ భీకర స్థాయిలోనే జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే, 2023లో జూబిలీహిల్స్ సహా కోర్ హైదరాబాద్ మొత్తం సీట్లు గెలిచిన బీఆర్ఎస్.. ఇప్పుడు అదే పట్టును నిలుపుకోవాలని చూస్తోంది. సిట్టింగ్ స్థానమైన జూబ్లిహిల్స్లో మరోసారి బంపర్ మెజార్టీతో గెలిచి… ప్రభుత్వంపై వ్యతిరేకత నిజమేనని నిరూపించాలన్న కసితో ఉంది.