2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం కన్వీనర్ కోటా కింద రిజస్ట్రేషన్ల గడువును కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు జులై 25వ తేదీతో రిజిస్ట్రేషన్ల గడువు ముగిసింది. అయితే లోకల్ కోటా పంచాయితీ ఇంకా..
రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల కోసం కన్వీనర్ కోటా కింద రిజస్ట్రేషన్ల గడువును కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు జులై 25వ తేదీతో రిజిస్ట్రేషన్ల గడువు ముగిసింది. స్థానిక, స్థానికేతర అంశంపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వినతులు వెళ్లువెత్తడంతో వర్సిటీ రిజిస్ట్రేషన్ తుది గడువును పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. తాజా ప్రకటన మేరకు జులై 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు తుది గడువును పొడిగించింది.
మరోవైపు మెడికల్ ప్రవేశాల్లో స్థానిక, స్థానికేతర అంశం నానుతూనే ఉంది. ఇప్పటికే దీనిపై సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయగా.. ఆగస్టు 5న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. కోర్టు తీర్పు మేరకు ప్రవేశాలు కల్పించేందుకు కాళోజీ వర్సిటీ సైతం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటి వరకు మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 17 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వీరిలో జీవో 33 ప్రకారం 300 మంది వరకు తెలంగాణ స్థానికేతరులుగా ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పిల్లలే అధికంగా ఉన్నారు. అలాగే సైనిక్ పాఠశాలల్లో చదివిన విద్యార్ధులు కూడా వరుసగా నాలుగేళ్లు రాష్ట్రంలో చదవకపోవడం వల్ల స్థానికేతరులుగా మిగిలిపోయారు.
దీంతో వీరంతా రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో లోకల్ కోటా కింద ప్రవేశాలు పొందడంలో నష్టపోతున్నారు. ఈ క్రమంలో 2023 నుంచి ఇప్పటివరకు ఎంతమంది అభ్యర్థులు స్థానికేతరుల కింద దరఖాస్తు చేశారో.. వారిలో ఎంతమంది కోర్టును ఆశ్రయించారనే వివరాలు అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక స్థానికత అంశం కొలిక్కి వచ్చేలోగా పీడబ్ల్యూడి, ఎస్సీ, ఎస్టీ తదితర కోటాల కింద రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని కాళోజీ వర్సిటీ ప్రకటించింది.