ఉత్తర తెలంగాణ దాని సమీపంలోని విదర్భ ప్రాంతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశలో కదిలి ఉత్తర తెలంగాణ, మధ్య విదర్భ దాని పరిసరాలలో ఉత్తర దిశలో బలహీనపడే అవకాశం ఉంది. ఈ రోజు అల్పపీడనం ఉపరితల ఆవర్తనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. రుతుపవన ద్రోణి, అల్పపీడన ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు నాన్స్టాప్ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తెలంగాణ విషయానికొస్తే.. ఇవాళ రాష్ట్రం మొత్తానికి ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణశాఖ. రాష్ట్రం అంతటా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. రుతుపవన ద్రోణి, అల్పపీడన ప్రభావంతో జోరువాన కురవడంతోపాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నారాయణపేట జిల్లా్ల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది వాతావరణశాఖ.
ఆంధ్రప్రదేశ్కి కూడా ఈరోజు ఎల్లో అలర్ట్ కంటిన్యూ అవుతోంది. నాలుగు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పిడుగులు కూడా పడతాయని.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు అధికారులు. ముఖ్యంగా అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో జోరువానతోపాటు పిడుగులు పడతాయని వెల్లడించింది.