ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్లో నగరానికి చెందిన ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధునులు భారీ ప్యాకేజీతో కొలువులు సొంతం చేసుకున్నారు. ఏడాదికి ఏకంగా రూ.46 లక్షల ప్యాకేజీతో ఇంజనీరింగ్ చివరి ఏడాది చదువుతుండగానే ఆఫర్ వచ్చింది. వివరాల్లోకెళ్తే.. హైదరాబాద్ శివారు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి మైసమ్మగూడలోని మల్లారెడ్డి మహిళా ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ఇంజినీరింగ్ చివరి సంవత్సరంలో ఉండగానే భారీ వేతన ప్యాకేజీతో ప్రఖ్యాత ఐటీ సంస్థ అమెజాన్లో కొలువులు సొంతం చేసుకున్నారు.
సీఎస్ఈ చివరి ఏడాది చదువుతున్న శృతి, శ్రీశ్రావ్యలు ఈ ఏడాది జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లలో రూ.46 లక్షల వార్షిక వేతనంతో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజినీర్లుగా అమెజాన్లో నియామకమయ్యారు. 2021-2025 బ్యాచ్కు ఇదే అత్యున్నత ప్యాకేజీ అని కాలేజీ ప్రిన్సిపల్ మాధవీలత తెలిపారు. ప్రఖ్యాత సంస్థలో అత్యున్నత వార్షిక వేతనంతో కొలువులు దక్కించుకున్న కళాశాలకు చెందిన విద్యార్థినులను ఆమె అభినందించారు. వీరి విజయం విద్యార్థులు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు.
టీజీపీఎస్సీ గ్రూప్ 1పై తీర్పు వాయిదా
తెలంగాణ గ్రూప్ 1 పరీక్షపై వివాదం కొలిక్కివచ్చింది. దీనిపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. టీజీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షలను రద్దుచేయాలని కొందరు కోరితే.. రద్దు చేయరాదంటూ ఎంపికైన అభ్యర్థులు వేసిన పిటిషన్లపై హోరాహోరీగా వాదనలు జరిగాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎంపికలు చేపట్టారంటే పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. పరీక్షకు మొత్తం 21 వేల మంది హాజరైతే కేవలం 5 వేల మందికే రీవాల్యుయేషన్ జరపడం వివక్ష కిందకు వస్తుందన్నారు. దీనిపై టీజీపీఎస్సీ తరఫు న్యాయవాదులు సమాధానం ఇస్తూ.. అవకతవకలు జరిగాయనడానికి రుజువులు చూపలేదని తెలిపారు. సందేహాలున్న చోట్ల మూల్యాంకనం జరిపారని అన్నారు. తెలుగు మీడియంలో రాసిన వారు తక్కువమంది అర్హత పొందారనే వాదన సరికాదనని అన్నారు. ఇరు వాదనలు విన్న జస్టిస్ రాజేశ్వర్రావు తీర్పును రిజర్వ్ చేశారు.