తెలంగాణలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి రేషన్ పంపిణీ ప్రారంభం కానుంది. అయితే ఈ-కేవైసీ పూర్తి చేసిన లబ్ధిదారులకే రేషన్ అందుబాటులో ఉంటుంది. బయోమెట్రిక్ ధృవీకరణ చేయని రేషన్ కార్డులు తాత్కాలికంగా నిలిపివేయబడే అవకాశం ఉన్నందున, లబ్ధిదారులు తమ సమీప రేషన్ షాప్ వద్ద వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.
తెలంగాణ ప్రభుత్వం త్వరితగతిన కొత్త రేషన్ కార్డులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో రేషన్ పంపిణీ ప్రక్రియను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరికి నెలకు 6 కిలోల చొప్పున నిత్యావసర వస్తువులు అందించనున్నారు. ఇదివరకే జూన్ నెలలో మూడు నెలల రేషన్ పంపిణీ పూర్తయినందున.. మళ్లీ సెప్టెంబరు నుంచి సరఫరా షురూ అవుతోంది.
అయితే.. ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయని లబ్ధిదారులకు రేషన్ సదుపాయం తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఈ అంశంపై జిల్లా పౌర సరఫరా అధికారి శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటన రిలీజ్ చేశారు. అందులోని వివరాల ప్రకారం.. జిల్లాలో 5.37 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటికి అనుబంధంగా దాదాపు 18.65 లక్షల లబ్ధిదారులు ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ-కేవైసీ ప్రక్రియను 13.19 లక్షల మంది మాత్రమే పూర్తిచేశారు. మిగిలిన వారు సెప్టెంబర్ నెల లోపు తప్పనిసరిగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన సూచించారు. చిన్నపిల్లలను (ఐదు సంవత్సరాల లోపు) ఈ ప్రక్రియ నుండి మినహాయించినట్లు తెలిపారు. రేషన్ కార్డు లబ్ధిదారులు ఎటువంటి ప్రయాణం అవసరం లేకుండా, తమ సమీప రేషన్ షాప్ నుండే బయోమెట్రిక్ ఆధారంగా ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం కల్పిపించనట్లు స్పష్టం చేశారు.
ఈ కేవైసీ చేయడం ద్వారా నకిలీ లబ్ధిదారులని గుర్తించి తొలగించడం, నిజమైన అర్హులకు న్యాయం చేయగలమని అధికారులు చెబుతున్నారు. అలాగే రేషన్ పంపిణీలో పారదర్శకతను పెంపొందించవచ్చని చెప్పారు. డిజిటల్ ఫింగర్ ప్రింట్ ఆధారంగా స్టోర్ చేసే డేటా ద్వారా భవిష్యత్తులో రేషన్తో పాటు ఇతర పథకాల ప్రయోజనాలు సులభంగా అందించవచ్చని వివరించారు. ఈ-కేవైసీ పూర్తి చేయని కుటుంబాలకు రేషన్ సౌకర్యం నిలిపివేసే అవకాశం ఉందని హెచ్చరిస్తూ.. అర్హులైన ప్రతి ఒక్కరూ త్వరలోనే నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని శ్రీనివాస్ రెడ్డి సూచించారు.