కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ అండగా నిలుస్తున్నారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. పుట్టకతోనే లివర్ సమస్యతో బాధపడుతున్న ఆరు నెలల చిన్నారికి వైద్యసాయం అందించి ప్రాణాలు నిలిపారు. చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన గజ్జల దీపూ నాయుడు అనే చిన్నారి పుట్టకతోనే లివర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో మెరుగైన వైద్యం కోసం తల్లిదండ్రులు ప్రైవేటు ఆసుపత్రిని సంప్రదించారు. లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని, ఇందుకు రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. పౌల్ట్రీ ఫామ్లో పనిచేసే చిన్నారి తండ్రి జగదీష్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో ఆర్థికసాయం కోసం మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషాను కలిశాడు.
దీంతో వైద్యఖర్చులకు గాను రూ.10లక్షల వరకు ఎల్ వోసీ మంజూరుచేయడం జరిగింది. అయితే లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు అధికమొత్తం అవసరం కావడంతో చిన్నారి తల్లిదండ్రులు మంత్రి లోకేష్ను కలిసి తన గోడు విన్నవించారు. దీంతో ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వైద్యసాయాన్ని రూ.15 లక్షల వరకు పెంచి ఎల్వోసీ మంజూరు చేయడం జరిగింది. ఆపదలో ఉన్నవారిని వెంటనే కలుసుకుని సాయం అందజేయడం గొప్ప విషయమని, ఒక్కరోజులోనే స్పందించి చిన్నారికి అండగా నిలవడం పట్ల మంత్రి నారా లోకేష్ కు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.