ఎమ్మెల్సీ కవిత చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ ఆర్డినెన్స్ సరైనదేనని వెనకేసుకొచ్చారు. ఆర్డినెన్స్ వద్దని బీఆర్ఎస్ నేతలు చెప్పడం తప్పు అంటూ సొంత పార్టీనే విమర్శించారు కవిత. నిపుణులతో చర్చించాకే ఆర్డినెన్స్కు మద్దతిచ్చానని చెప్పారు కవిత. BRS వాళ్లు నా దారికి రావాల్సిందేనని అన్నారు. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ స్పందించలేదుని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని పార్టీ విజ్ఞతకే వదిలేస్తున్నానని కవిత అన్నారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్.. కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాన్ని షేక్ చేస్తోన్న అంశమిది. పంచాయతీల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు హైకోర్టు విధించిన గడువు దగ్గర పడుతుండటంతో.. ఆర్డినెన్స్ ద్వారా చట్టసవరణ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
రిజర్వేషన్ల ఫైలును న్యాయశాఖ ఆమోదించిన తర్వాత.. మంత్రి, సీఎం ఆమోదంతో రాజ్భవన్కు ముసాయిదాను పంపించింది తెలంగాణ ప్రభుత్వం. పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 285 క్లాజ్-ఎ ప్రకారం స్థానిక సంస్థల్లో 50 శాతానికి మించకుండా రిజర్వేషన్లు ఉండాలి. అందులో 50శాతానికి మించకుండా అనే వాక్యాన్ని తొలగించి.. చట్టాన్ని సవరిస్తే రిజర్వేషన్ల అమలుకు ఎలాంటి చిక్కులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది.
ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్ ఆమోదిస్తే చట్టసవరణ అమల్లోకి రానుంది. దీనికి అనుగుణంగా డెడికేటెడ్ కమిషన్.. స్థానిక సంస్థలకు రిజర్వేషన్లను సిఫార్సు చేయనుంది. వాటి ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపనుంది. అయితే.. గవర్నర్ ఆమోదిస్తారా.. లేదా.. అనేది ఉత్కంఠగా మారింది.