అర్ధరాత్రి నెల్లూరు బస్టాండ్ దగ్గర కాస్త హడావుడి నెలకొంది. భార్యభర్తలను ఆపిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పేరిట రూ. 10 వేలు కట్టమని చెప్పారు. ఈలోగా రంగంలోకి స్థానిక ఎమ్మెల్యే దిగారు. ఆ తర్వాత సీన్ జరిగిందిదే..
నెల్లూరులోని వేదాయపాలెం సర్కిల్లో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేశారు. ఓ దంపతులు బైక్ మీద వెళుతుండగా ఆపిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ అని రూ. 10 వేలు కట్టమని చెప్పారు. దీంతో సదరు బాధితులు ఏం చేయాలో తెలియక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేశారు. ఎమ్మెల్యే నేరుగా ఘటనాస్థలికి చేరుకొని.. ట్రాఫిక్ పోలీసులకు ఫోన్ చేశారు. తాను ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉన్నానని.. తక్షణమే బైక్ను బాధితులకు హ్యాండోవర్ చేయాలని చెప్పారు. దీంతో క్షణాల్లో బైక్ను ఆర్టీసీ బస్టాండ్కు తీసుకొచ్చి దంపతులకు అప్పజెప్పారు పోలీసులు. తమకు చేసిన సాయానికి వారిరువురూ ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.
రాత్రి సమయంలో ఎమ్మెల్యేలు చాలామంది ఫోన్ తీయడమే కష్టం. అలాంటిది ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేరుగా వచ్చి తమ సమస్యను తీర్చడంతో వారు కృతజ్ఞతలు తెలిపారు. భార్య, భర్త.. అందులోనూ అర్ధరాత్రి కావస్తున్న సమయంలో పోలీసులు ఇలా బైక్ తీసుకెళ్లడం.. అందులోనూ మధ్యం సేవించకుండానే డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఫైన్ కట్టమని డిమాండ్ చేయడం.. ఇక చేసేదేమిలేక ఎమ్మెల్యేకే ఫోన్ చేయడం.. ఎట్టకేలకు తమ సమస్య తీరడంతో ఊపిరి పీల్చుకుంది ఆ కుటుంబం.