పేదింటి కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు పోత్సహకంగా ప్రధాన్ మంత్రి ఉచ్చతర్ శిక్షా ప్రోత్సాహన్ యోజన (PM-USP Yojana) కింద స్కాలర్షిప్ అందిస్తుంది. ఈ పథకం కింద అండర్ గ్రాడ్యుయేట్లకు మొదటి 3 సంవత్సరాలకు ఒక్కో ఏడాది రూ.12 వేలు, పోస్ట్గ్రాడ్యుయేట్స్కు రూ.20 వేల చొప్పున స్కాలర్షిప్ అందిస్తారు..
భారత ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విద్యార్ధుల చదువులకు చేయూత ఇచ్చేందుకు తీసుకొచ్చిన ప్రధాన్ మంత్రి ఉచ్చతర్ శిక్షా ప్రోత్సాహన్ యోజన (PM-USP Yojana) కింద సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిప్ ఫర్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ (PM-USP CSSS) పధకాన్ని విడుదల చేసింది. ఈ పథకం కింద యేటా 82 వేల కొత్త స్కాలర్షిప్లు అందిస్తుంది. పేదింటి కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు పోత్సహకంగా ఈ స్కాలర్షిప్ అందిస్తుంది. ఈ పథకం కింద అండర్ గ్రాడ్యుయేట్లకు మొదటి 3 సంవత్సరాలకు ఒక్కో ఏడాది రూ.12 వేలు, పోస్ట్గ్రాడ్యుయేట్స్కు రూ.20 వేల చొప్పున స్కాలర్షిప్ అందిస్తారు. అలాగే ఇంటిగ్రేటెడ్ / ప్రొఫెషనల్ కోర్సులు: 4వ, 5వ సంవత్సరానికి రూ.20 వేలు చొప్పున అందిస్తారు. అర్హత కలిగిన విద్యార్ధులు ఎవరైనా వెబ్సైట్ పోర్టల్లో అక్టోబర్ 31, 2025లోపు దరఖాస్తులు చేసుకోవచ్చు. మొత్తం స్కాలర్షిప్లలో 50 శాతం మహిళలకు అందిస్తారు.
ఇవి అర్హతలు
సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిప్ ఫర్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ (PM-USP CSSS)కు దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు రాష్ట్ర ఇంటర్ బోర్డ్ ద్వారా నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షలో 80 శాతానికిపైగా మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. విద్యార్థులు రెగ్యులర్ డిగ్రీ కోర్సులో ప్రవేశం పొంది ఉండాలి. ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ స్కాలర్షిప్లు, ఫీజు రిఈంబర్స్మెంట్ పథకాల లబ్ధిదారులుగా ఉండకూడదు. విద్యార్ధి కుటుంబ వార్షిక ఆదాయం రూ.4.5 లక్షలకు మించకూడదు. డిగ్రీలో ప్రతి యేట 50 శాతం మార్కులు, 75 శాతం హాజరు తప్పనిసరి. అలాగే విద్యార్ధుల వయోపరిమితి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎలా దరఖాస్తు చేయాలంటే..
అర్హత కలిగిన విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ (NSP) [www.scholarships.gov.in]లో ఆన్లైన్ విధానంలో అక్టోబర్ 31, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. NSPలో దరఖాస్తు చేసే సమయంలో అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయవల్సి ఉంటుంది. ఇంటర్ మార్కుల మెమో, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, డిగ్రీలో ప్రవేశం పొందిన కాలేజ్ లేదా యూనివర్సిటీ అడ్మిషన్ రుజువు పత్రాలు, సంస్థ AISHE కోడ్, కేటగిరీ సర్టిఫికెట్ వంటి అవసరమైన ధ్రువీకరణ పత్రాలన్నీ సమర్పించవల్సి ఉంటుంది. ఎంపికైన వారికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్(DBT) ద్వారా స్కాలర్షిప్ డబ్బులు జమ అవుతాయి. అలాగే నిర్దిష్ట సమయానికి విద్యార్ధులు రిన్యువల్ దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.