ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు తను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు పవన్ కల్యాణ్. తాజాగా ఆయన విజయ నగరం జిల్లాకు చెందిన ఓ ఇంటర్మీడియెట్ కుర్రాడిని ప్రత్యేకంగా తన ఆఫీస్ కు పిలిపించుకుని మరీ అభినందించారు.
విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్ధి రాజాపు సిద్ధూ బ్యాటరీతో నడిచే సైకిల్ ను తయారు చేశాడు. అది కూడా అతి తక్కువ ఖర్చుతో. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి రాజాపు సిద్దూను ప్రత్యేకంగా అభినందించారు. వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణకు రూపం ఇచ్చిన సిద్ధూ గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుని అతన్ని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని ప్రత్యేకంగా మాట్లాడారు. సిద్దూ ఆవిష్కరించిన సైకిల్ ని స్వయంగా నడిపారు. అతని ఆలోచనలు తెలుసుకుని అబ్బురపడ్డారు. సిద్ధూ రూపొందించిన గ్రాసరీ గురూ వాట్సప్ సర్వీస్ బ్రోచర్ చూసి ప్రత్యేకంగా అభినందించారు. అతని ఆలోచనలకు మరింత పదునుపెట్టాలని ఆకాంక్షిస్తూ రూ.లక్ష ప్రోత్సాహకం అందించారు. ఈ సందర్భంగా బ్యాటరీ సైకిల్ పై సిద్ధూని కూర్చోబెట్టుకొని నడిపారు పవన్ కల్యాణ్.
విజయనగరం జిల్లా, జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన సిద్ధూ సుదూరంలో ఉన్న కాలేజీకి వెళ్లేందుకు స్వయంగా ఒక ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేశాడు. మూడు గంటలు బ్యాటరీ ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణించగల ఈ సైకిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా జులై 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండేళ్ల గ్యాప్ తర్వాత వస్తోన్న సినిమా కావడంతో పవన్ అభిమానులు వీరమల్లు రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. జాగర్ల మూడి క్రిష్, జ్యోతి కృష్ణ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నిధి అగర్వాల్ హీరయిన్ గా నటించింది. అలాగే బాలీవుడ్ నటుడు బాబీ డియోలో మరో కీలక పాత్రలో మెరిశాడు.