ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్-పాకిస్తాన్ మధ్యవర్తిత్వ ప్రతిపాదనను తిరస్కరించారు. జమ్ముకశ్మీర్ విషయంలో ఎవరి జోక్యమూ అనవసరమని స్పష్టం చేశారు. ట్రంప్ తో 35 నిమిషాల ఫోన్ కాల్ లో ఈ విషయాన్ని వివరించారు. పాకిస్తాన్ తో కాల్పుల విరమణపై నేరుగా చర్చలు జరిగాయని కూడా తెలిపారు.
భారత్-పాక్ మధ్య యుద్ధం ఆపింది నేనే అంటూ పదేపదే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి మోదీకి గట్టి డోస్ ఇచ్చారు. “మీకు అంత సీన్ లేదు” అని అర్థం వచ్చేలా క్లాస్ తీసుకున్నంత పనిచేశారు. మీ జోక్యాన్ని ఎవ్వరూ అడగలేదంటూ ట్రంప్కి తేల్చిచెప్పారు ప్రధాని మోదీ. భారత్, పాక్ మధ్య ట్రంప్ మధ్యవర్తిత్వం ప్రకటనను ప్రధాని మోదీ ఖండించారు. జమ్ముకశ్మీర్పై భారత్-పాక్ మధ్య ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని కూడా స్పష్టం చేశారు. ఇక ముందు కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదని అన్నారు.
ట్రంప్ విజ్ఞప్తి మేరకు 35 నిమిషాల పాటు మోదీ ఫోన్ కాల్ మాట్లాడారు. ఈ సందర్భంగా.. “కాల్పుల విరమణపై పాక్తో మేం నేరుగా చర్చించాం. పాక్ విన్నపం మేరకు కాల్పుల విరమణపై చర్చించాం. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది.” ప్రధాని అన్నారు. వాస్తవానికి ఈ విషయాన్ని మోదీ నేరుగా ట్రంప్కే చెప్పాల్సి ఉంది. కానీ కెనడాలో ఇద్దరు నేతల సమావేశం జరగలేదు. కానీ ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్- హుటాహుటిన అమెరికాకు బయల్దేరారు. మోదీని కలుసుకోలేకపోయిన ట్రంప్, ఆయనతో ఫోన్లో మాట్లాడినట్లు భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి వివరించారు.
కెనడాలో G7 సమ్మిట్లో పాల్గొని ప్రధాని మోదీ క్రొయేషియా వెళ్లారు. దానికి ముందు తిరుగు ప్రయాణంలో అమెరికా వస్తారా అని ట్రంప్ ప్రధాని మోదీని అడిగారు. ప్రస్తుత షెడ్యూల్ కారణంగా అది కుదరదని మోదీ, ట్రంప్తో అన్నారు. అయితే త్వరలో సమావేశం కావాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపైనా కూడా చర్చించారు. రష్యా-ఉక్రెయిన్ నేరుగా మాట్లాడుకోవాలని మోదీ అభిప్రాయపడ్డారు.