రిమాండ్ ఖైదీ అంటే 14రోజుల పాటు జైల్లో ఉంటారు. కానీ విచిత్రంగా నటుడు పోసాని కృష్ణమురళి మాత్రం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. పైగా పోసాని.. ముందు మాకే కావాలంటూ పోలీసులు క్యూ కడుతున్న పరిస్థితి. ఇంతకీ ఆయన ఎందుకు వాంటెడ్గా మారారు?
ఓ వైపు ఫిర్యాదులు… ఇంకోవైపు కేసులు.. పోసాని కృష్ణమురళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి రోజుకో జైలు అన్నట్టుగా మారిపోయింది. అనుచిత వ్యాఖ్యల కేసులో నరసరావుపేట పీఎస్లో నమోదైన కేసులో పోసాని గుంటూరు జైల్లో ఉన్నారు. అయితే కర్నూలు జిల్లా ఆధోని త్రీ టౌన్ పీఎస్లో పోసానిపై కేసు నమోదైంది. దీంతో గుంటూరు జిల్లా జైల్లో ఉన్న పోసానిని పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం గుంటూరు నుంచి ఆదోనికి తరలించారు. మంగళవారం గుంటూరు జిల్లా నరసరావుపేట, అనంతపురం రూరల్, అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు.. రాజంపేట జైలుకి వెళ్లి పీటీ వారెంట్లు అందించారు. పోసానిని ముందు మాకే అప్పగించాలంటూ వాహనాలు కూడా సిద్ధం చేసుకున్నారు. ఒకేసారి 3 పీటీ వారెంట్లు రావడంతో పోసానిని ముందుగా ఎవరికి అప్పగించాలనే విషయంపై జైలు అధికారులు ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపారు.
నిబంధనలు పరిశీలించిన అనంతరం పోసానిని పల్నాడుజిల్లా నరసరావుపేట పోలీసులకు అప్పగించారు. BNS యాక్ట్ సెక్షన్ 153, 504, 67ల కింద నరసరావుపేటలో పోసానిపై గతంలో కేసు నమోదైంది. ఆయనను అప్పగించడానికి ముందు రాజంపేట జైలు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. గుండెనొప్పి ఉందని చెప్పడంతో వైద్యుల్ని పిలిచి టెస్ట్లు చేయించారు. ఎయితే డాక్టర్లు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పడంతో పోసానిని నరసరావుపేట పోలీసులకు అప్పగించారు. లేటెస్ట్గా ఆదోని పోలీసులు పీటీ వారెంట్తో ఎంట్రీ ఇచ్చి పోసానిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం పోసాని రిమాండ్లో ఉన్నారు. అన్నమయ్యజిల్లా రాజంపేట జైలులో విచారణ ఎదుర్కొంటున్నారు. న్యాయస్థానం ఆయనకు 14రోజుల రిమాండ్ విధించింది. ఈనెల 13తో రిమాండ్ ముగుస్తుంది. ఇందులో ఆయనకు బెయిల్ వచ్చినా వెంటనే మరో కేసులో అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.