ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) ఆధ్వర్యంలో మొత్తం 691 ఫారెస్ట్ బీట్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు సెప్టెంబర్ 7వ తేదీన ప్రిలిమినీర రాత పరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఆఫ్లైన్ విధానంలో ఈ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. మొత్తం పోస్టుల్లో ఫారెస్ట్ బీట్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ పోస్టులకు 1,17,958 మంది దరఖాస్తు చేసుకున్నారని.. 100 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు 19,568 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ 13 జిల్లాల్లో పరీక్ష కేంద్రాల కేంటాయింపు పూర్తైందని, ఇటీవల హాల్ టికెట్లు కూడా జారీ చేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి రాజాబాబు తెలిపారు.
పరీక్ష సమయంలో అభ్యర్ధులు తప్పుల్లేకుండా OMR షీట్లను పూరించాలని ఆయన పేర్కొన్నారు. చిన్న చిన్న తప్పులు చేసిన అభ్యర్థి భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుందని హెచ్చరించారు. OMR షీట్పై అభ్యర్థులు బ్లూ లేదా బ్లాక్ బాల్పెన్తో మాత్రమే నింపి, బబ్లింగ్ చేయాలన్నారు. అభ్యర్థులు తప్పులు చేస్తే ఓఎంఆర్ షీట్ ఇన్వాలిడ్ అవుతుందని.. దిద్దినా, కొట్టివేసినా, గోళ్లతో చెరిపినా, వైట్నర్ పెట్టినా ట్యాంపరింగ్ అయినట్లుగా ఏపీపీఎస్సీ భావిస్తుందని ఆయన తేల్చిచెప్పారు.
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు నాలుగు సిరీస్లలో (A, B, C, D) అందిస్తామన్నారు. అభ్యర్థులు సంబంధిత OMR (ఆప్టికల్ మార్క్ రీడర్) షీట్లోని సర్కిల్లను జాగ్రత్తగా పూరించాలని అన్నారు. ఈ పరీక్షల్లో 1/3 నెగెటివ్ మార్కులు ఉన్నాయనే విషయాన్ని అభ్యర్థులు గుర్తించాలన్నారు. తప్పు ఆన్సర్లు గుర్తిస్తే మార్కుల్లో కోత విధిస్తామన్నారు. ఇక ఏపీపీఎస్సీ నిర్వహించిన అన్ని పరీక్షల ఫలితాలను సెప్టెంబర్ చివరి నాటికి విడుదల చేస్తామని కార్యదర్శి పి రాజా బాబు వెల్లడించారు.