భారత ప్రధాని నరేంద్ర మోడీ నేటి నుంచి ఎనిమిది రోజుల పాటు ఐదు దేశాల సుదీర్ఘ పర్యటనకు బయలుదేరనున్నారు. గత దశాబ్ద కాలంలో మోడీ చేస్తున్న అత్యంత సుదీర్ఘమైన విదేశీ పర్యటన ఇది. ఈ పర్యటనలో ఆయన ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియా దేశాలను సందర్శించనున్నారు. ముఖ్యంగా బ్రెజిల్లో జరిగే బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడం ఈ పర్యటనలోని ప్రధాన ఉద్దేశ్యం. గ్లోబల్ సౌత్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, వాణిజ్యం, రక్షణ, శక్తి రంగాల్లో సహకారాన్ని పెంపొందించడంపై ప్రధాని మోడీ దృష్టి సారించనున్నారు. అలాగే, ప్రధానమంత్రి బ్రెజిల్లో జరిగే కీలకమైన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలోనూ పాల్గొంటారు.
ప్రధాని మోదీ చివరి ఎనిమిది రోజుల పర్యటన జులై 2015లో ఆరు దేశాల పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో ప్రధాని మోడీ రష్యాతోపాటు ఐదు మధ్య ఆసియా దేశాలను సందర్శించారు. ఈ పర్యటన రక్షణ, అరుదైన భూమి ఖనిజాలు, ఉగ్రవాద నిరోధక చర్యలపై సహకారం వంటి అంశాలపై దృష్టి సారిస్తుందని అధికారులు తెలిపారు.
పూర్తి పర్యటన వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
జులై 2-3: ఘనా
- మోడీ పర్యటన ఘనాతో ప్రారంభమవుతుంది. మూడు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఘనాలో పర్యటించడం ఇదే మొదటిసారి.
- ఘనా అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆర్థికం, ఇంధనం, రక్షణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై చర్చిస్తారు.
- పశ్చిమ ఆఫ్రికా రాష్ట్రాల ఆర్థిక సంఘం, ఆఫ్రికన్ యూనియన్తో భారతదేశ సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ పర్యటన దోహదపడుతుంది.
- వ్యాక్సిన్ హబ్ను ఏర్పాటు చేయడానికి మద్దతు ఇస్తారు.
- ఘనా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తారు.
పశ్చిమ ఆఫ్రికాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఘనా ఒకటి. ఘనా ఎగుమతులకు భారతదేశం అతిపెద్ద గమ్యస్థానం. ఘనా నుంచి భారతదేశం చేసే దిగుమతుల్లో బంగారం 70 శాతానికి పైగా ఉంది. జనవరిలో ఘనా అధ్యక్షుడిగా ఎన్నికైన జాన్ మహామా, 2015లో ఇండియా-ఆఫ్రికా ఫోరం సమ్మిట్ కోసం భారతదేశాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే.
జులై 3-4: ట్రినిడాడ్ అండ్ టొబాగో
- ఘనా పర్యటన అనంతరం కరేబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగోకు మోడీ బయలుదేరుతారు.
- 1999 తర్వాత భారత ప్రధాని ఈ దేశంలో పర్యటించడం ఇదే ప్రథమం.
- ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షురాలు క్రిస్టీన్ కార్లా కంగలూ, ప్రధాన మంత్రి కమ్లా పెర్సాద్-బిస్సేసర్లతో మోడీ సమావేశమవుతారు.
- ఈ దేశ పార్లమెంటు ఉమ్మడి సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.
- ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక, చారిత్రక సంబంధాలకు ఈ పర్యటన కొత్త ఊపునిస్తుందని విదేశాంగ శాఖ తెలిపింది. ఆరోగ్యం, డిజిటల్ టెక్నాలజీ, రక్షణ రంగాల్లో సహకారంపై దృష్టి సారిస్తారు.
ఘనా నుంచి మోడీ జులై 3 నుంచి రెండు రోజుల పర్యటన కోసం ట్రినిడాడ్, టొబాగోకు వెళతారు. 1999 తర్వాత భారత ప్రధానమంత్రి ఆ దేశానికి చేయడం ఇదే మొదటిసారి.
జులై 4-5: అర్జెంటీనా
- కరేబియన్ దేశం నుంచి నేరుగా దక్షిణ అమెరికాలోని అర్జెంటీనాకు ప్రధాని వెళ్తారు.
- అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీతో విస్తృత స్థాయి చర్చలు జరుపుతారు.
- రక్షణ, వ్యవసాయం, మైనింగ్, చమురు, గ్యాస్, పునరుత్పాదక శక్తి, వాణిజ్యం, పెట్టుబడులు వంటి కీలక రంగాల్లో ఇండియా-అర్జెంటీనా భాగస్వామ్యాన్ని మరింత మెరుగుపరచడంపై దృష్టి పెడతారు.
- ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ పేర్కొంది.
జులై 5-8: బ్రెజిల్ (BRICS శిఖరాగ్ర సదస్సు)
- అర్జెంటీనా పర్యటన ముగిసిన తర్వాత, జూలై 5 నుంచి 8వ తేదీ వరకు బ్రెజిల్లో ప్రధాని మోడీ పర్యటిస్తారు.
- రియో డి జనీరోలో జరిగే 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొంటారు. ఇది ప్రధానిగా మోడీ నాలుగో బ్రెజిల్ పర్యటన.
- సదస్సు సందర్భంగా పలు దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది.
- పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్పై దృష్టి సారించి, ఉగ్రవాదంపై కఠిన వైఖరిని BRICS సదస్సులో వినిపించనున్నారు.
- డిఫెన్స్, ట్రేడ్, టెక్నాలజీ, ఇంధన సహకారంపై చర్చలు జరుగుతాయి.
- 2026లో బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలు భారత్ చేపట్టనున్న నేపథ్యంలో, ప్రస్తుత సదస్సు కీలకమైనది.
బ్రెజిల్లో బ్రిక్స్ నాయకుల శిఖరాగ్ర సమావేశం..
అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా ఆహ్వానం మేరకు మోడీ బ్రెజిల్ పర్యటనలో నాల్గవ, అతి ముఖ్యమైన దశలో భాగంగా పర్యటించనున్నారు. జులై 5 నుంచి 8 వరకు బ్రెజిల్లో జరిగే 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి మోడీ హాజరవుతారు. ఆ తర్వాత రాష్ట్ర పర్యటన చేస్తారు. ప్రధానమంత్రిగా మోడీ బ్రెజిల్కు ఇది నాల్గవ పర్యటన అవుతుంది. 17వ బ్రిక్స్ నాయకుల శిఖరాగ్ర సమావేశం రియో డి జనీరోలో జరుగుతుంది.
జులై 8-9: నమీబియా
- ఈ సుదీర్ఘ పర్యటన చివరి దశ నమీబియా.
- భారత ప్రధాని నమీబియాలో పర్యటించడం ఇది మూడోసారి.
- నమీబియా అధ్యక్షుడు నెతుంబో నంది-నదిత్వా (Netumbo Nandi-Ndaitwah)తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.
- నమీబియా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
- గ్రీన్ ఎనర్జీ, వాటర్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, భారతదేశ యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) అమలు వంటి అంశాలపై చర్చలు జరగనున్నాయి.
ఈ పర్యటన భారతదేశం తన “గ్లోబల్ సౌత్” దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడంతోపాటు కీలకమైన ప్రాంతీయ, అంతర్జాతీయ వేదికలపై తన ప్రభావాన్ని విస్తరించడంలో కీలక పాత్ర పోషించనుంది. రక్షణ, వాణిజ్యం, ఇంధన భద్రత, వ్యూహాత్మక ఖనిజాలు, డిజిటల్ మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించడంపై ఈ పర్యటన ప్రధానంగా దృష్టి సారించనుంది.