విశాఖ సముద్రతీరంలో మత్స్యకారుల శ్రమ ఫలించింది. వలల నిండుగా రొయ్యలు, చేపలు, అరుదైన లాబ్స్టర్లు చిక్కాయి. ఈ సీజన్ ప్రారంభంలోనే పుష్కలంగా మత్స్య సంపద లభించడంతో మత్స్యకారులు ఆనందంగా ముంచెమడుతున్నారు. 500 కిలోల వరకు రొయ్యలతో సహా, ఒక్కోటి కిలో బరువున్న లాబ్స్టర్లు భారీ ధర పలుకుతున్నాయి.
విశాఖ తీరంలో మత్స్యకారుల పంట పండుతోంది. వేటకు వెళ్లిన మత్స్యకారుల శ్రమ ఫలిస్తుంది. వలల నిండా చేపలు, రొయ్యలు, లాబ్స్టర్లు చిక్కుతున్నాయి. దీంతో మత్స్యకారులకు సిరులు కురిపిస్తోంది. ట్యూనా, పఫర్ ఫిష్, పండుగప్ప, రిబ్బన్ ఫిష్, వివిధ రకాల రొయ్యలు.. ఒకటేంటి.. సముద్రంలో మత్స్యరాసులు వలకు నిండుగా చిక్కడంతో ఫిషింగ్ హార్బర్లో సందడి వాతావరణం నెలకొంది. కొత్త సీజన్ కోసం మత్స్యకారులు బోటు యజమానంతా ఆశతో ఎదురు చూశారు. గంగమ్మ తల్లికి ప్రత్యేకంగా పూజలు చేసి… జూన్ 14 అర్ధరాత్రి నుంచి వేట మొదలుపెట్టారు. విడతల వారీగా ఫిషింగ్ హార్బర్ లో లంగర్ వేసిన బోట్లని సముద్రంలో వేటకు వెళ్లాయి. కోటి ఆశలతో వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఆ గంగమ్మ తల్లి కరుణించింది. పుష్కలంగా మత్స్య సంపద చిక్కింది.
సముద్రంలో వెళ్లిన కొద్ది దూరానికి చేపలు, రొయ్యలు పుష్కలంగా వలకు చిక్కేసాయి. ఒక్కో బోటుకు 500 కిలోల వరకు రొయ్యలు లభించాయి. వివిధ రకాల చేపలతో పాటు.. రొయ్యలు పుష్కలంగా ఉండుకు చేరాయి. రొయ్యల్లో బ్రౌన్, పింక్, వైట్, టైగర్ రకం రొయ్యలు కిలోలకు కిలోలు చిక్కేసాయి. చేపల కంటే రొయ్యలే ఈ సీజన్లో భారీగా పడడంతో ఇక మత్స్యకారులు బోటు యజమానులకు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. బోటు నిండా రొయ్యల లోడుతో ఒడ్డుకు చేరుకుంటున్నాయి బోట్లు.
ఇక విశాఖ సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఆదివారం అరుదైన లాబ్స్టర్లు పట్టాయి. రొయ్యల రూపంలో కనిపించే ఈ లాబ్స్టర్లు సాధారణంగా అరుదుగా దొరుకుతాయని వారు తెలిపారు. అందులో రెండు లాబ్స్టర్లు ఎంతో ప్రత్యేకంగా ఉన్నాయి. ఒక్కోటి కిలో బరువు తూగాయి. వాటి ధర ఒక్కోటి రూ.2 వేలు పలికింది. లాబ్స్టర్లకు విదేశాల్లో ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ.. ఎక్కువ శాతం ఎగుమతి చేస్తామని మత్స్యకారులు వెల్లడించారు.