పోలీసులు ఎంతలా అరికట్టాలని చూస్తున్నప్పటికీ నగరంలో డ్రగ్స్, గంజాయి పట్టుబడుతూనే ఉంది. మరోసారి పోలీసుల తనిఖీల్లో రూ.5 కోట్ల విలువైన గంజాయి పట్టుబడింది. హైదరాబాద్లోని బాటసింగారంలో భారీగా గంజాయి పట్టుకున్నారు. ఒడిశా, ఏపీ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తుండగా రూ.5 కోట్ల విలువైన గంజాయి సీజ్ చేశారు పోలీసులు. 934 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుంది ఈగల్ టీమ్. DCM వాహనంలో పండ్ల బాక్స్ల మధ్యలో గంజాయిని తరలిస్తూ దొరికిపోయారు. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులు పరారయ్యారు. పారిపోయిన నిందితుల కోసం పోలీసులు వేటాడుతున్నారు.
ఓపక్క డ్రగ్స్, మరోవైపు గంజాయి. కొత్త మత్తు కోసం కొందరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, బడాబాబులు వెంపర్లాడుతుంటే.. ఏదో మార్గాల్లో అవి మహా నగరానికి చేరిపోతున్నాయి. దీంతో ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు ఎప్పటికప్పుడు డ్రగ్స్, గాంజా ఆటకట్టిస్తున్నారు. గంజాయ్, డ్రక్స్ను అరికట్టేందుకు డెకాయ్ అపరేషన్ నిర్వహిస్తున్నారు.
దేశంలో ఎక్కడ గంజాయి పట్టుకున్నా ఆ మూలాలు ఏపీ, ఓడిశా వైపే చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గంజాయి సాగును నిర్మూలించడానికి కఠిన చర్యలు చేపట్టింది. ఈ చర్యలు చాలావరకు ఫలించాయనుకుంటున్న తరుణంలో చాపకింద నీరులా గంజాయి సాగు విస్తరిస్తుండటాన్ని పోలీసులు గుర్తించారు. గంజాయి సాగువుతన్న ప్రాంతాలైన పాడేరు, పెదబయలు, ముంజంగిపుట్టు సహా మరికొన్ని మండలాలపై నిఘా పెంచారు.
ఇతర రాష్ట్రాల నుంచి మన్యం మీదుగా రవాణా జరుగుతుండడంపై అధికారుల దృష్టిపెట్టారు. ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల వెంట 26 చెక్ పోస్టులు నిర్వహిస్తున్నారు. సీసీ టీవీల ద్వారా గంజాయి రవాణాదారులను గుర్తించి చర్యలు చేపడుతున్నారు. గత ఏడాది ఏర్పాటైన ఈగల్ వ్యవస్థ క్రియాశీలంగా పనిచేస్తోంది.