హైదరాబాద్లోని కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్ వెలుగు చూసింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న కారుపై ఎంపీ స్టిక్కర్ దర్శనమిచ్చింది. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. రేవ్పార్టీ నిందితులకు రాజకీయంగా సంబంధాలు ఉన్నాయా అనేదానిపై పోలీసులు ఎంక్వైరీ చేశారు. స్టిక్కర్పై దర్యాప్తు చేపట్టిన పోలీసులు అది నకిలీదని నిర్ధారించారు. టోల్ చార్జీ కట్టకుండా తప్పించుకునేందుకే కారుకు ఎంపీ స్టిక్కర్ వేసుకున్నట్టు గుర్తించారు. ఎంపీ స్టిక్కర్ ఫేక్ అని ఎక్సైజ్ అధికారులు తేల్చారు. సీజ్ చేసిన కారు అశోక్ నాయుడిదిగా గుర్తించారు.
ఆదివారం కొండాపూర్ SV సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ నిర్వహిస్తుండగా.. దాడి చేసి 11 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా గంజాయి, OG kush డ్రగ్, LSD బోల్ట్, చరాస్ డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు. పార్టీలో పాల్గొన్న వారు ఏపీకి చెందిన వారిగా గుర్తించారు. అరెస్ట్ చేసిన వారిలో మంగళగిరి, విజయవాడ, కాకినాడ, రాజమండ్రికి చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. 2 కేజీల గంజాయి, 50 గ్రాముల ఓజీ కుష్ డ్రగ్, 11.57 గ్రాముల మ్యాజిక్ ముష్రూమ్, 1.91 గ్రాముల చెరస్ డ్రగ్స్, 2 కార్లు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని విచారణ ముమ్మరం చేశారు.
వీకెండ్ సందర్భంగా రేవ్ పార్టీని నిర్వహించింది అశోక్ నాయుడు అని పోలీసులు చెబుతున్నారు. రేవ్ పార్టీ సందర్భంగా రెండు కార్లను సీజ్ చేసిన పోలీసులు… అందులో ఒక ఫార్చ్యూనర్ కారుకు లోక్సభ ఎంపీ స్టిక్కర్ ఉండటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ కారులో ఎవరు వచ్చారు…? ఆ ఎంపీ పేరేంటి…? ఆయనే వచ్చారా లేక ఆ కారులో ఆయన బంధువులెవరైనా వచ్చారా…? అన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేశారు. అశోక్ నాయుడికి రాజకీయ నేతలతో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో అది నకిలీ స్టిక్కర్గా తేల్చారు పోలీసులు.
అయితే పార్టీ కోసం డ్రగ్స్ను డార్క్ వెబ్ ద్వారా కొనుగోలు చేశారని… పార్టీ మొదలైన పది నిమిషాల్లోనే అందరిని పట్టుకున్నామన్నారు ఎక్సైజ్ పోలీసులు.