ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ మిథున్రెడ్డికి లుక్ అవుట్ సర్క్యులర్ జారీ అయింది. మిథున్ రెడ్డిపై నమోదైన లిక్కర్ కేసులో ఇప్పటికే హై కోర్టులో బెయిల్ పిటిషన్ డిస్ మిస్ అయింది. బెయిల్ పిటిషన్ డిస్ మిస్ కావడంతో విదేశాలకు వెళ్లకుండా లుక్ అవుట్ సర్కులర్ జారి చేశారు. ఈ కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్నారు. మద్యం అమ్మకాల్లో ఆన్ లైన్ పేమెంట్ విధానాన్ని మాన్యువల్ మోడల్ గా మార్చడంలో మిథున్ రెడ్డిది కీలక పాత్ర అని సిట్ తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
ముడుపులు ఇచ్చిన కంపెనీలకే మద్యం సరఫరా అనుమతులు ఇచ్చారని, దీని కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ. 3,500 కోట్ల నష్టం వాటిల్లిందని లూథ్రా హైకోర్టులో వాదించారు. ఈ స్కామ్ లో మిథున్ రెడ్డిది మాస్టర్ మైండ్ అని లూథ్రా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మిథున్ రెడ్డి తన ఎంపీ పదవిని దుర్వినియోగం చేశారని అన్నారు. మిథున్ రెడ్డికి నేర చరిత్ర ఉందని… ఆయనపై ఇప్పటికే 8 కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కొట్టివేయాలని కోరడంతో కోర్టు మిథున్రెడ్డి పిటిషన్ను డిస్మిస్ చేసింది.
మరోవైపు మిథున్ రెడ్డి తరపున టి.నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం విధానంతో మిథున్ రెడ్డికి సంబంధం లేదని ఆయన కోర్టులో వాదనలు వినిపించారు. షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇవ్వాలని నిరంజన్రెడ్డి కోరారు. మిథున్ రెడ్డి ముందుస్తు బెయిల్ ను కొట్టివేస్తూ కోర్టు తీర్పునివ్వడంతో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
మరోవైపు ముడుపుల సొమ్మును తరలించడంలో తుడా పాత్రను నిగ్గు తేల్చిన సిట్.. మరింత లోతైన దర్యాప్తుపై దృష్టి సారించింది. ఇప్పటికే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులుగా పనిచేసిన వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచింది. తుడా ఉపాధ్యక్షుడిగా, కార్యదర్శిగా పనిచేసిన వెంకటనారాయణ, అప్పటి పరిపాలనాధికారి గుణశేఖర్రెడ్డి, వాహనాల పర్యవేక్షకుడిగా పనిచేసిన మోహన్కుమార్ను విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. నిందితులు, సాక్షులను విచారించి స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని అరెస్టు చేయడంతో పాటు తుడాకు చెందిన వాహనాలను ముడుపుల తరలింపు కోసం వాడినట్లు సిట్ నిర్ధారించి… తుడా వాహనాల డ్రైవర్లలో ముగ్గుర్ని అదుపులో తీసుకుని విచారించింది.
ఏపీ లిక్కర్ స్కాంలో 10 నెలలుగా విచారణ కొనసాగుతోంది. ఇప్పటివరకు 290 మందిని విచారించింది. ఇప్పుడు తుడా పాత్రపై విచారణ జరగుతోంది. 2024 ఫిబ్రవరి నుంచి తుడాకు చెందిన వాహనాలను ముడుపుల తరలింపునకు వినియోగించినట్లు సిట్ అధికారులు శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలు సేకరించారు. వాస్తవానికి ఎన్నికల ప్రకటన విడుదలైన వెంటనే చెవిరెడ్డి ఆధీనంలో ఉన్న వాహనాలను తుడాకు అప్పగించినప్పటికీ ముడుపుల తరలింపు సమయంలో లాగ్బుక్లో నమోదు చేయకుండా తుడా డ్రైవర్ల సహకారంతో వాహనాలను వినియోగించినట్లు సమాచారం.