కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) ‘కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ 2025’ (సీహెచ్ఎస్ఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ పూర్తి చేసిన వారు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు..
ఇంటర్మీడియట్ విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) ‘కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్ 2025’ (సీహెచ్ఎస్ఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 3,131 లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్డీసీ), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో), డేటా ఎంట్రీ ఆపరేటర్ (గ్రేడ్-ఎ) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్ధులు ఎవరైనా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్ఎస్సీ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్-2025కు సంబంధించి దరఖాస్తులు, ఎంపిక విధానం వంటి ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోవచ్చు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్ధులకు ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఓపెన్ స్కూల్ ద్వారా చదివిన అభ్యర్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాలో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్లో సైన్స్ గ్రూప్లో మ్యాథ్స్ సబ్జెక్టు తప్పనిసరిగా చదివి ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు జనవరి 1, 2026 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జనవరి 2, 1999 నుంచి జనవరి 1, 2008 మధ్య జన్మించిన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 15 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు జూలై 18, 2025 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.100 చెల్లించల్సి ఉంటుంది. అయితే మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. టైర్ 1, టైర్ 2 రాత పరీక్షల ద్వారా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ఎల్డీసీ, జేఎస్ఏ పోస్టులకు రూ.19,900 నుంచి 63,200 వరకు, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు నెలకు రూ.25,500 నుంచి 81,100 వరకు, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్-ఎ పోస్టులకు నెలకు రూ.29,200 నుంచి 92,300 వరకు జీతంగా చెల్లిస్తారు.
రాత పరీక్ష విధానం..
టైర్ 1 రాత పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. టైర్ 2 పరీక్ష 405 మార్కులకు ఉంటుంది. ఇందులో మ్యాథమేటికల్ ఎబిలిటీస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యుల్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
ముఖ్యమైన తేదీలు..
- ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభ తేదీ: జూన్ 23, 2025.
- ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 18, 2025.
- ఆన్లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపులకు చివరి తేదీ: జూలై 10, 2025.
- దరఖాస్తు సవరణ తేదీ: జూలై 23, 24 తేదీల్లో
- టైర్ 1 రాత పరీక్ష తేదీ: 2025, సెప్టెంబర్ 8 నుంచి 18 వరకు
- టైర్ 2 రాత పరీక్ష తేదీ: ఫిబ్రవరి, మార్చి 2026