అనకాపల్లి జిల్లా రావికంధం మండలం టి అర్జాపురం పంచాయతీ శివారు గ్రామమైన డోలవానిపాలెంలో ఎస్టీ ఆదివాసి కొండ దొర గిరిజనులు నివసిస్తారు. సత్తిబాబు అనే వ్యక్తి తన ఇంట్లో అవసరాల కోసం రెండు బల్బులు, ఓ టీవీ మాత్రమే ఉన్నాయి. వాటి కోసం విద్యుత్ వినియోగిస్తూ ఉంటారు. అయితే.. విద్యుత్ రీడింగ్ తీసేందుకు వచ్చిన సిబ్బంది బిల్లు తీసి చేతిలో పెట్టారు. ప్రతి నెల మాదిరిగా వందల్లో వస్తుందని అనుకున్నారు.. కానీ అక్షరాల 1,60,000 కరెంట్ బిల్లు వచ్చిందని చెప్పి చేతిలో పెట్టి వెళ్ళిపోయారు. దీంతో ఏం చేయాలో పాలు పోక కుటుంబం అంతా తల పట్టుకుంది. ఏం చేయాలో తెలియక సత్తిబాబు తల్లి లక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది.
అలాగే ఇంకో కుటుంబానిది కూడా ఇలాంటి గాదే. గాదె కొండమ్మ పేద గిరిజనురాలు.. కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. భర్త నాగరాజు చనిపోవడంతో ఒంటరిగానే జీవిస్తుంది. ఆమె నివసిస్తున్న ఇంటికి ఏకంగా 40 వేల కరెంటు బిల్లు. వీళ్లే కాదు దాదాపుగా ఈ గ్రామంలో చాలామందికి ఇలాగే ఊహించనంత భారీగా కరెంట్ బిల్లులు వచ్చాయి. ఎస్టి కుటుంబాలకు 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితం.. ఉచిత మాట దేవుడెరుగు ఏకంగా లక్షల రూపాయల కరెంట్ బిల్లు రావడంతో ఆ గిరిజనుల ఆవేదన అంతా అంతా కాదు. కూలి పనులు చేసుకునే తాము ఇంత భారీ కరెంట్ బిల్లును ఎలా చెల్లించగలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. అయితే సాంకేతిక సమస్య కారణంగానే ఈ బిల్లు వచ్చిందని.. సరి చేస్తామని అధికారులు చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు ఆ గ్రామస్తులు.