బాలల మేధో వికాసానికి చదరంగం ఎంతో దోహదపడుతుంది. ఈ చదరంగంలో కొందరు బాలలు అద్భుతాలు సృష్టిస్తున్నారు. చదరంగంలో సరికొత్త ప్రపంచ రికార్డును సాధించి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాడు ఓ బుడతడు.180 బోర్డులపై వేగంగా పావులు కదుపుతూ 5,334 ప్రాబ్లమ్స్, కాంబినేషన్స్ అండ్ గేమ్స్ ఇన్ లాస్లో పోల్గారు ను విజయవంతంగా పూర్తి చేసి నోబెల్ ప్రపంచ రికార్డుల్లో చోటు సంపాదించాడు. అయితే ఈ రికార్డు ఇప్పటి వరకూ ఓ సీఎం మనవడి పేరిట ఉండగా.. ఆ రికార్డును తిరగరాశాడు ఈ బుడతడు. ఇంతకీ ఆ సీఎం మనవడు ఎవరు.. రికార్డ్ ని బీట్ చేసిన బుడతడు ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన గుండా మహేష్- చంద్రకళ దంపతుల కుమారుడు కార్తికేయ ఐదో తరగతి చదువుతున్నాడు. పిట్ట కొంచెం.. కూత ఘనం అన్నట్లుగా చదువులోనూ ముందంజలో ఉండేవాడు. బాలుడి ఐక్యూ ను గుర్తించిన తల్లిదండ్రులు కొన్నేళ్లుగా ఆన్ లైన్ లో చదరంగంలో శిక్షణ ఇప్పిస్తున్నారు. మిర్యాల గూడలో ప్రపంచ చెస్ క్రీడాకారిణి మాశెట్టి దివ్యశ్రీ ఏర్పాటు చేసిన డైమండ్ చెస్ అకాడమీలో చేరి ప్రాక్టీస్ చేస్తున్నాడు. డైమండ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన నోబెల్ ప్రపంచ రికార్డు సాధనలో గుండా కార్తికేయ పాల్గొన్నాడు. ఈ పోటీల్లో కార్తికేయ సరికొత్త ప్రపంచ రికార్డును సాధించి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించాడు. 9.41 నిమిషాలలో 180 బోర్డులపై వేగంగా పావులు కదుపుతూ 5334 ప్రాబ్లమ్స్,కాంబినేషన్స్ అండ్ గేమ్స్ ఇన్ లాస్లో పోల్గార్ లో పజిల్స్ పరిష్కరించి ప్రపంచ రికార్డు సాధించాడు.
నారా దేవాన్ష్ రికార్డును తిరగ రాసిన కార్తికేయ..
ఇప్పటి వరకూ చదరంగంలో చెక్ మేట్ సాల్వర్ విభాగంలో 11:59 నిమిషాలలో ఈ ఘనతను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాన్స్ పేరిట ఉందీ ఈ రికార్డు. ఇప్పుడు దేవాన్ష్ రికార్డ్ ను బ్రేక్ చేసి చిన్నారి కార్తికేయ రికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంతర్జాతీయ చెస్ క్రీడాకారుల సమక్షంలో జరిగిన కాంపిటీషన్ లో కార్తికేయ ఈ ఘనత సాధించాడు. సరికొత్త రికార్డును సృష్టించిన కార్తికేయకు చెస్ పోటీల నిర్వాహకులు, నోబెల్ ప్రపంచ రికార్డు ప్రతినిధులు నోబెల్ ప్రపంచ రికార్డు ధ్రువీకరణ పత్రం, షీల్డును అందించి అభినందించారు.
చెస్ మాస్టర్ కావడమే నా లక్ష్యం.. కార్తికేయ..
చదరంగంలో ప్రపంచ స్థాయి గ్రాండ్ మాస్టర్ కావడమే తన లక్ష్యమని కార్తికేయ చెప్పాడు. బాలల మేధో వికాసానికి ఎంతో దోహదపడే చదరంగంలో మిర్యాలగూడ ప్రాంతంలో ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు చేసే లక్ష్యంతో అకాడమీ ఏర్పాటు చేసి, చిన్నారులను తీర్చిదిద్దుతున్న డైమండ్ చెస్ అకాడమీ నిర్వాహకురాలు మాశేట్టి దివ్యశ్రీని అభినందించారు. ఇదే స్ఫూర్తితో ఈ ప్రాంతం నుంచి మరింతమంది చాంపియన్లను తయారు చేయాలని, మిర్యాలగూడకు పేరు తీసుకురావాలని పట్టణ ప్రముఖులు ఆకాంక్షించారు.