తెలంగాణలో ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త. ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపునకు ఈ ఏడాది సర్కారు నిరాకరించింది. ఇష్టారీతిన ఫీజుల పెంపు ప్రతిపాదనలపై ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. కొత్త ఫీజుల అధ్యయనానికి కమిటీ వేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఫీజుల అంశంపై భేటీ అయిన టీఏఎఫ్ఆర్సీ – తెలంగాణ అడ్మిషన్స్, ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఈ యేడాది పాత ఫీజులతోనే ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ ఏడాది ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం జులై మొదటి వారంలో ఎప్ సెట్ కౌన్సిలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఫీజుల పెంపు అంశంపై కాలేజీల ప్రతిపాదనలంపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఫీజుల సవరణపై, ప్రతిపాదనల అధ్యయనానికి ఒక సబ్ కమిటీ వేయాలని నిర్ణయించారు. అప్పటివరకు పాత ఫీజులనే అమలు చేయాలని ఆదేశించారు. 2025-26 విద్యాసంవత్సరం నుంచి మూడేళ్లకు కొత్త ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. కానీ సీఎం ఆదేశాలతో కాలేజీల తీరు, 2016 నాటికి టాస్క్ఫోర్స్ నివేదికలు, ఫీజుల పెంపు ప్రతిపాదనలపై అధ్యయన కమిటీ వేయనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది.
ఇంజినీరింగ్ విద్యలో ప్రతి మూడేళ్లకోసారి ఫీజుల పెంపు ప్రక్రియ సాగుతోంది. కాలేజీల్లో మౌళిక వసతులు, విద్యా ప్రమాణాలు పెంచుకున్నా.. కొన్ని కాలేజీలు అత్యధిక ఫీజు పెంపు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. దీంతో కాలేజీల్లో వసతులు, నిబంధనల అమలుపై నాటి టాస్క్ పూర్స్ నివేదికలు బయటపెట్టాలని సర్కారు ఆలోచన. దీంతో ఇప్పుడు కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ యాజమాన్యాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 174 ఇంజినీరింగ్ కళాశాలలు ఉంటే అందులో 155 ప్రైవేట్ వే. వీటిలో ఇంకా నాలుగు కాలేజీలకు ఏఐసీటీయూ అనుమతులు రావాల్సి ఉంది.
మొత్తంగా ఫీజుల పెంపు తాత్కాలికంగా బ్రేక్ పడినా.. కౌన్సిలింగ్ సమయానికి అధ్యయనం పూర్తైతే స్వల్పంగా పెంచే అవకాశం లేకపోలేదు. అధ్యయనం ఆలస్యం అయితే ఈ ఏడాది పాత ఫీజులతోనే విద్యార్థుల చదువులు బయటపడనున్నాయి. అంటే వచ్చే ఏడాది నుంచి ఇంజినీరింగ్ ఫీజులు పెరుగుతాయన్నమాట.