తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న గ్రామ పాలన అధికారుల (జీపీవో) పోస్టుల భర్తీకి మరోమారు రెవెన్యూశాఖ సమాయాత్తమవుతోంది. ఇందులో భాగంగా తాజాగా రెండో విడతగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది మార్చి 29న రెవెన్యూ శాఖ మొదటి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 10,954 జీపీవో పోస్టులను భర్తీ చేసింది. గతంలో వీఆర్ఏ, వీఆర్వో పోస్టులకు ఎంపికైన వారికి అవకాశం కల్పించింది. ఇందులో ఐదు వేల మంది దరఖాస్తు చేసుకోగా 3,550 మంది జీపీవోలుగా ఎంపియ్యారు.
మిగతా ఖాళీల భర్తీకి కూడా వీఆర్ఏ, వీఆర్వోలకు అవకాశం ఇచ్చేందుకు రెవెన్యూశాఖ మరో నోటిఫికేషన్ జారీ చేసింది. మిగిలిన ఖాళీలను భర్తీ చేయాలని ఇటీవల రెవెన్యూ సంఘాలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కోరగా.. ఈ మేరకు మిగిలిన ఖాళీల భర్తీకి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ ప్రకటన విడుదల చేశారు. ఈ పోస్టులకు వీఆర్ఏ, వీఆర్వోలు ఆన్లైన్ ద్వారా జులై 16, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
జులై 27న లైసెన్స్డ్ సర్వేయర్లతో కలిపి పరీక్ష
గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లో జీపీవోల ఎంపికకు అర్హత పరీక్ష నిర్వహించారు. ఈ సారి కూడా అర్హత పరీక్ష ద్వారానే వీరిని ఎంపిక చేస్తారు. ఈ పరీక్షను జులై 27న నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న లైసెన్స్డ్ సర్వేయర్లకు కూడా ఈ రాత పరీక్ష రాయాల్సి ఉంది. ఈ క్రమంలో జీపీవోలు, లైసెన్స్డ్ సర్వేయర్లకు కలిపి ఒకేసారి పరీక్ష నిర్వహించేందుకు రెవెన్యూ శాఖ కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది.