తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. గచ్చిబౌలి పీఎస్లో గతంలో ఆయనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును హైకోర్టు కొట్టివేసింది. 2016లో సొసైటీ స్థలాన్ని ఆక్రమించేందుకు రేవంత్ రెడ్డి అతని సోదురు ప్రయత్నించారని పెద్దిరాజు అనే వ్యక్తి గచ్చిబౌలి పీఎస్లో ఫిర్యాదు చేశారు. పెద్దిరాజు ఫిర్యాదును పరిగనణలోకి తీసుకున్న గచ్చిబౌలి పోలీసులు నాడు రేవంత్ రెడ్డి, అతని సోదరుడు కొండల్ రెడ్డి, లక్ష్మయ్యలపై ఎస్సీ, ఎస్టీ నిర్బంధ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. అయతే ఈ కేసును కొట్టివేయాలంటూ 2020లో రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
రేవంత్ రెడ్డి పిటిషన్ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు పిటిషన్పై విచారణ జరిపింది. ఈ కేసులో తాజాగా గత నెల 20న ఇరువైపుల వాదనలు కూడా పూర్తయ్యాయి.దీంతో కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇక తాజాగా జూలై 17 గురువారం ఈ కేసు తుదితీర్పును న్యాయస్థానం వెలువరించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సంఘటన జరిగిన సమయంలో రేవంత్ రెడ్డి ఘటనాస్థలిలో లేరని దర్యాప్తులో తేలినట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. అంతేకాకుండా ఫిర్యాదుదారు చేసిన ఆరోపణలకు సరైన సాక్ష్యాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. కావును రేవంత్ రెడ్డిపై నమోదైన కేసును కొట్టివేస్తున్నట్టు తీర్పు వెలువరించింది.