నీట్ యూజీ 2025 పరీక్షలో తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 43,400 మంది అర్హత సాధించారు. ఈ మేరకు ఎంపిక జాబితాను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం విడుదల చేసింది. ఇది కేవలం నీట్లో అర్హత పొందిన అభ్యర్థుల వివరాలు తెలిపే జాబితా మాత్రమేనని, మెరిట్ జాబితా కాదని వర్సిటీ స్పష్టం చేసింది. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం తాత్కాలిక మెరిట్ జాబితాను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. ఎన్సీసీ, సీఏపీ, పీఎంసీ, ఆంగ్లో ఇండియన్, ఎస్సీసీఎల్ మెరిట్ జాబితాను విడిగా విడుదల చేస్తామని పేర్కొంది. ఇక దివ్యాంగ అభ్యర్థులకు మెడికల్ బోర్డు ద్వారా పరీక్షలు నిర్వహించి తుది జాబితాను ప్రకటిస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి జాబితాను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరోవైపు నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ జులై చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య యూనివర్సిటీ వర్గాలు సూచన ప్రాయంగా తెలిపాయి.
దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలకు చెందిన మెరిట్ జాబితాను ప్రకటించిన తరువాత.. ముందుగా జాతీయ స్థాయిలో మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఓపెన్ కోటా కౌన్సెలింగ్ జరుగుతుంది. ఈ ప్రక్రియ జులై చివరి వారంలో ప్రారంభమవుతుంది. నేషనల్ కౌన్సెలింగ్ పూర్తయ్యాక ఆయా రాష్ట్రాల్లో అభ్యర్థులు కౌన్సెలింగ్ మొదలవుతుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో జులై చివర్లో వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. ఆగస్టు తొలి వారంలో కౌన్సెలింగ్ ప్రారంభంకానుంది.
ఏపీ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల.. ఎంత మంది ఎంపికయ్యారంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు కానిస్టేబుల్ నియామక మెయిన్ పరీక్షల ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. పోలీసు కానిస్టేబుల్ సివిల్ (పురుషులు, మహిళలు), పోలీస్ కానిస్టేబుల్ (ఏపీఎస్పీ పురుషులు) మెయిన్ పరీక్షల ఫలితాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మొత్తం 37,600 మంది ఈ పరీక్షకు హాజరవ్వగా, అందులో 3,921 మంది అర్హత సాధించారు. వీరిలో పురుషులు 29,211 మంది, మహిళలు 4,710 మంది ఉన్నారు. ఈ మేరకు పోలీసు నియామక మండలి చైర్మన్ రాజీవ్ కుమార్ మీనా గురువారం తెలిపారు. ఫలితాలను అధికారిక వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అభ్యర్థులు వెబ్సైట్ నుంచి ఓఎంఆర్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. జులై 12 సాయంత్రం 5 గంటల్లోగా రూ.వెయ్యి రుసుము చెల్లించి ఆన్లైన్లో రీ వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించినట్లు ఆయన తెలిపారు.