హైదరాబాద్లో ప్రపంచ సుందరి పోటీలపై వివాదం నెలకుంది. మే 4 నుంచి 31వరకు తెలంగాణలో ‘మిస్ వరల్డ్’ పోటీలు నిర్వహణకు ప్లాన్ చేశారు. హైదరాబాద్ వేదికగా గ్రాండ్ ఫినాలే, ప్రారంభ-ముగింపు వేడుకలు జరగనున్నాయి. మిగతా ఈవెంట్స్ కోసం రామప్ప, యాదాద్రి, లక్నవరం, అనంతగిరి ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. తెలంగాణలో అందాల పోటీల నిర్వహణను విశ్వ హిందు పరిషత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అడ్డుకుని తీరుతామని చెబుతోంది.
గతంలో కూడా భారత్లో మిస్ వరల్డ్ పోటీలు జరిగాయ్. 1996, 2024లో ముంబై వేదికగా ప్రపంచ సుందరి పోటీలు నిర్వహించారు. ఇప్పుడు మూడోసారి మిస్వరల్డ్ పోటీలకు ఆతిత్యమిస్తోంది భారత్. అయితే, ఈసారి దుబాయ్తో పోటీపడి మరీ అవకాశం దక్కించుకుంది తెలంగాణ. తెలంగాణ వేదికగా 72వ మిస్వరల్డ్ పోటీలను నిర్వహించనుండటం చాలా ఆనందంగా ఉందన్నారు తెలంగాణ పర్యాటకశాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపు.. చారిత్రక, ప్రత్యేక గ్రామీణ నేపథ్యంతోనే హైదరాబాద్కి ఈ అవకాశం దక్కిందన్నారు.
8 నుంచి 9 ఈవెంట్స్గా మిస్ వరల్డ్ పోటీలను నిర్వహిస్తారు. తెలంగాణ పర్యాటకశాఖతో కలిసి ప్రపంచ సుందరి పోటీలను నిర్వహిస్తోంది మిస్వరల్డ్ సంస్థ. ఈ పోటీల కోసం 10 వేదికలను పరిశీలిస్తున్నారు. ప్రారంభ ముగింపు వేడుకలు, గ్రాండ్ ఫినాలేను హైదరాబాద్లో నిర్వహించనున్నారు. అయితే, మిగతా ఈవెంట్స్ కోసం రామప్ప, యాదాద్రి, లక్నవరం, అనంతగిరి వంటి ప్రాంతాలు ఉండటం వివాదాస్పదమవుతోంది. ఆధ్యాత్మిక కేంద్రాల్లో అందాల పోటీలను ఎలా నిర్వహిస్తారంటోంది వీహెచ్పీ.
బికినీలతో అందాలు ఆరబోసే విదేశీ విష సంస్కృతి తమకొద్దు అంటున్నారు VHP జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్. రామప్ప, యాదాద్రి, అనంతగిరి లాంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లో ఇలాంటి వికృత పోటీలకు అనుమతి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. మిస్ వరల్డ్ పోటీలకు ఇచ్చిన అనుమతిని ప్రభుత్వం రద్దు చేయాలని.. లేదంటే అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. VHP జాతీయ అధికార ప్రతినిధి శశిధర్
కేవలం, ప్రపంచ సుందరి పోటీలను నిర్వహించడమే కాదు.. తెలంగాణలో పర్యాటకాన్ని ఎంకరేజ్ చేయడం, పేదరిక నిర్మూలన కోసం కూడా పనిచేయనుంది మిస్వరల్డ్ సంస్థ. ఎంతో శ్రమించి ప్రపంచ సుందరి పోటీలను తెలంగాణకు తీసుకొస్తున్నట్టు చెప్పింది ఆ సంస్థ.