రాష్ట్రంలో ఆర్టీసీ డ్రైవర్ల విషయంలో తెలంగాణ రాష్ట్రరోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విధులు నిర్వహించే ఆర్టీసీ డ్రైవర్ల వద్ద సెల్ఫోన్లు ఉండకూడదని యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కొత్త నిబంధనలు ఇవాళ్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.
ఆర్టీసీ అంటేనే సురక్షిత ప్రయాణం, ప్రయాణికుల భద్రత పెట్టింది పేరు. అయితే ఇటీవల కాలంలో పెరుగుతున్న ఆర్టీసీ బస్సుల రోడ్డు ప్రమాదాలపై యాజమాన్యం ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో కొన్ని సార్లు బస్సు డ్రైవర్లు సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదాలను నివారించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విధుల సమయంలో డ్రైవర్ల వద్ద సెల్ఫోన్లు ఉండకూడదని నిర్ణయిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కొత్త విధానం నేటినుంచి( సోమవారం) రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది.
అయితే మొదటగా రాష్ట్రంలోని కొన్ని డిపోలో ఈ విధాన్ని అమలు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా తీసుకురావాలని చూస్తోంది. ఈ క్రమంలోనే కార్పొరేషన్ పరిధిలోని 11 రీజియన్ల నుంచి ఒక్కో డిపోను పైలట్ ప్రాజెక్ట్ కింద ఆర్టీసీ యాజమాన్యం ఎంపిక చేసింది. ఇక్కడ ఈ విధానం సక్సెస్ ఫుల్ అయితే దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది.
ఏంటి ఈ కొత్త విధానం
ఆర్టీసీ తీసుకొచ్చిన కొత్త విధానం ప్రకారం.. ఉదయం డ్యూటీకి వచ్చే డ్రైవరు తన సెల్ఫోన్ను స్విచ్ఛాప్ చేసి డిపోలోని సెక్యూరిటీ ఆఫీస్ వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సాయంత్రి విధులు ముగించుకొని ఇంటికి వెళ్లే ముందు తమ ఫోన్ను తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంటినుంచి కానీ తమ కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎవైనా అత్యవసర సమయాల్లో వారితో మాట్లాడేందుకు డిపోల్లో ప్రత్యేకంగా ఓ సెల్ఫోన్ నంబరును ఆర్టీసీ అందుబాటులో తీసుకువచ్చింది. వారి కుటుంబ సభ్యులు ఆ నంబరుకు కాల్ చేసి డిపోకు సమాచారమిస్తే వారు సంబంధిత బస్సు కండక్టర్ ద్వారా సదరు డ్రైవర్తో మాట్లాడడానికి వీలు కల్పిస్తారు.
ఈ కొత్త విధానం ఏఏ డిపోల్లో అమలు కానుంది.
ఫరూక్నగర్ (హైదరాబాద్), కూకట్పల్లి (సికింద్రాబాద్), కొల్లాపూర్ (మహబూబ్నగర్), సంగారెడ్డి (మెదక్), మిర్యాలగూడ (నల్గొండ), జగిత్యాల (కరీంనగర్), ఖమ్మం (ఖమ్మం), కామారెడ్డి (నిజామాబాద్), వికారాబాద్ (రంగారెడ్డి), ఉట్నూర్ (ఆదిలాబాద్), , పరకాల (వరంగల్)