నంద్యాల జిల్లాలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. స్కూల్ బస్సు కింద పడి మూడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అక్క బస్సు ఎక్కేందుకు వెళుతుండగా ఆమె వెంటనే చూసేందుకు వచ్చిన బాలుడిని బస్సు ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ముక్కుపచ్చలారని చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
అక్క స్కూల్కు వెళ్తుండగా చూసేందుకు వచ్చి ప్రమాదానికి గురై తమ్ముడు మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లాలోని అవుకు మండలం సుంకేసుల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన ఎర్రబెల్లి శ్రీనివాసులు, మీనాక్షి దంపతులకు ఇద్దరు కూతుర్లతో పాటు మహిధర్ అనే కుమారుడు ఉన్నాడు. ఈ దంపతులు ఇద్దరు కూతుళ్లు స్థానికంగా ఉన్న పాఠశాలలో చదువుతున్నారు. వీరిలో రిషిత ప్రస్తుతం 3వ తరగతి చదువుతుంది. అయితే సుంకేసుల గ్రామంలోని విద్యార్థిని విద్యార్థులను ఎక్కించుకు నేందుకు ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సులు తరచూ గ్రామానికి వస్తూ ఉంటాయి.
రోజూలాగే మంగళవారం కూడా పిల్లలను ఎక్కించుకోవడానికి గ్రామానికి స్కూల్ బస్సు వచ్చింది. దీంతో రిషిత బస్సు ఎక్కేందుకు ఇంట్లో నుంచి బయల్దేరింది. అయితే ఆమె వెంటనే తన తమ్ముడు మహిధర్ కూడా వెళ్లాడు. కానీ ఇంట్లో వాళ్లు దాన్ని గమనించలేదు. ఈ క్రమంలో బాలుడిని గమనించని డ్రైవర్ బస్సును స్టార్ట్ చేయడంతో ఈ ప్రమాద చోటుచేసుకుంది. ప్రమాదంలో బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు బాలుడిని హాస్పిటలకు తరలించిన ఎటువంటి లాభం లేకపోయింది.
ఇక ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకొని ఘటనా స్థలానికి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే పిల్లల్ని స్కూల్కు పంపించే విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. చిన్నపిల్లలు ఉంటే వారే నేరుగా బస్సు దగ్గరకు వచ్చి పిల్లలను బస్సులో ఎక్కించిన తర్వాత అక్కడి నుంచి వెళ్లాలని సూచించారు. బస్సు డ్రైవర్లు కూడా వెనకా ముందూ చూసుకొని వాహనాలు నడపాలని తెలిపారు.