ఆపదమొక్కుల వాడు కోనేటి రాయుడు మొక్కులు తీర్చుకునే భక్తులతో ఈ ఏడాది తిరుమల కొండ కిటికిట లాడింది. జూన్ నెలలో సగటున 80వేల మందికి పైగానే భక్తులు శ్రీవారిని దర్శించుకోవడంతో హుండీ ఆదాయం కూడా అనూహ్యంగా పెరిగింది. అవును జూన్ లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో హుండీ ఆదాయం కూడా రికార్డ్ స్థాయిలో లభించిందని టీటీడీ ప్రకటించింది.
తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు కలియుగంలో అపరకుభేరుడు ఆయనే. వెంకన్న ఆదాయం కూడా ఇప్పుడు అంతకంతకు పెరుగుతుండటమే నిదర్శనం. తిరుమలేశుడి ఆదాయంలో హుండీ ఆదాయం కీలకంగా మారిపోవడంతో వెంకన్న ఆస్తుల విలువ కొండంత అవుతోంది. ఇప్పటికే వెల కట్టలేని ఆస్తులున్న సంపన్నుడైన శ్రీ వెంకటేశ్వరుడి ఆలయం ఏటేటా పెరుగుతూనే ఉంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది వేసవిలో భక్తులతో కొండ కిటకిటి లాడింది. రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం కూడా పెరిగింది. రోజుకు సగటున 80 వేల మంది భక్తులు తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకోగా హుండీలో సమర్పించిన కానుకల విలువ కూడా గణనీయంగా పెరిగింది. జూన్ నెలలో రూ 119.86 కోట్ల మేర హుండీ ద్వారా టీటీడీ కి ఆదాయం రాగా 24.08 లక్షల మంది భక్తులు వెంకన్నను దర్శించుకున్నారు. ఇక ఈ నెల ఆఖరి రోజు అంటే జూన్ 30న శ్రీవారి హుండీ ఆదాయం రూ 5.30 కోట్లు రాగా జూన్ 14 న అత్యధికంగా 91,720 మంది శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ చెబుతోంది.
ఇక ఈ నెలలో మొత్తం 5 రోజులు ప్రతిరోజు 90 వేలకు పైగానే భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 10 రోజులు ఒక్కో రోజు 80వేల మంది కి పైగా భక్తులు వెంకన్నను దర్శించుకోవడం మరో రికార్డు. ఇక రోజు సగటున రూ. 4 కోట్ల మేర హుండీ ద్వారా టీటీడీకి ఆదాయం రాగా మొక్కులో భాగంగా శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు కూడా 10.05 లక్షల మంది ఉన్నారు. ఇక గత మే నెల హుండీ ఆదాయం, శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్యకు భారీ తేడానే ఉండగా వేసవి లో జూన్ నెల టీటీడీ కి కీలకంగా మారింది.
మే నెలలో 23.77 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా హుండీ ద్వారా టీటీడీకి రూ 106.83 కోట్ల ఆదాయం చేకూరింది. ఇలా జూన్ నెలలో భక్తుల సంఖ్య, హుండీ ఆదాయం రెండూ పెరగ్గా టీటీడీ కూడా భక్తుల సంఖ్య తగ్గట్టుగానే విస్తృత సేవలు అందించింది. తిరుమల యాత్రకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసింది.