టీటీడీ మాజీ పీఆర్వో నిష్కా బేగం ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి.. భారీగా బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై టీటీడీ స్పందించింది. నిష్కా బేగం అనే వ్యక్తి ఎవరూ గతంలో టీటీడీ పీఆర్వోగా పనిచేయలేదని స్పష్టంచేసింది. ఈ వార్తల్లో నిజం లేదని.. అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ పీఆర్వోగా నిష్కా బేగం అనే మహిళ పనిచేసిందని.. ఆమె ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆమె ఇంట్లో ఈడీ అధికారులు భారీగా నగలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు కొన్ని ఫోటోలు, వీడియోలను జతచేర్చి ఈ వార్తను షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై టీటీడీ స్పందించింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలు అవాస్తమని స్పష్టంచేసింది.
టీటీడీలో గతంలో ఎప్పుడూ నిష్కా బేగం అనే వ్యక్తి పీఆర్వోగా పనిచేయలేదని ఆ ప్రకటనలో టీటీడీ స్పష్టంచేశారు. గతంలో ఎక్కడో జరిగిన ఘటనకు సంబంధించిన ఫొటోలను వాడుకుని టీటీడీపై దుష్ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొంది. భక్తులను తప్పుదోవ పట్టించి, వారి మనోభావాలను దెబ్బతీసేలా అవస్తవాలను ప్రచారం చేయడం సరికాదని స్పష్టంచేసింది. ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేసే వారికి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.