కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు బారులు తీరతారు. శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కలు తీర్చుకుంటారు. అయితే తిరుమల క్షేత్రంలో హోటల్స్ లో లభించే ఆహారపదార్ధాల ధరల గురించి టీటీడీ తాజాగా ఓ ప్రకటన రిలీజ్ చేసింది.
తిరుమల తిరుపతి క్షేత్రం హిందువులకు పరమ అవిత్రమైన స్థలం. కలియుగ వైకుంఠం క్షేత్రం తిరుమలలో కొలువైన స్వామివారిని దర్శించుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటారు. కోనేటి రాయుడి కోసం తిరుమలకు చేరుకుంటారు. అందుకనే తిరుమల నిత్యకళ్యాణం పచ్చతోరణంలా ఉంటుంది. భారీ సంఖ్యలో భక్తుల రద్దీతో నిండి ఉంటుంది. అయితే తిరుమలలో స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులకు తగిన సౌకర్యాలను టీటీడీ ఏర్పాటు చేస్తూనే ఉంటుంది.
భక్తుల కోసం వసతి సదుపాయాలను కల్పిస్తోంది. అన్న ప్రసాదాలను ఉచితంగా అందిస్తోంది. అదే సమయంలో తిరుమల పై అనేక హోటల్స్ కూడా ఉన్నాయి. ఈ హోటల్లో దొరికే ఆహార పదార్ధాల ధరలు తగ్గయంటూ ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలు తమ దృష్టికి వచ్చాయని.. ఈ వార్తలు పూర్తిగా అసత్యం అని దీనిని భక్తులు నమ్మవద్దు అంటూ టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
తగ్గిన ఆహార పదార్థాల ధరలు అంటూ ప్రచారం చేస్తున్న వార్తలతో పాటు, ఇతర వివరాలు పూర్తిగా అబద్ధమని వెల్లడించింది. అంతేకాదు ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్నవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. తిరుమల తిరుపతి క్షేత్రానికి సంబంధించిన ఏ విషయంపై ఎటువంటి సమాచారం భక్తులకు కావల్సినా అధికారిక టీటీడీ వెబ్ సైట్ www.tirumala.org ని సందర్శించడం ద్వారా లేదా టీటీడీ కాల్ సెంటర్ 18004254141కి ఫోన్ చేసి మాత్రమే తెలుసుకోవాలని అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేశారు.