తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్న్యూస్ చెప్పింది. అక్టోబర్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శనం టికెట్ల కోటా వివరాలను ప్రకటించింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబర్ నెల కోటాను ఈ నెల 19న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
అక్టోబర్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శనం టికెట్ల కోటా వివరాలను టీటీడీ ప్రకటించింది. వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలపై స్పష్టత ఇచ్చింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబర్ నెల కోటాను జూలై 19న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూలై 21 ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ పేర్కొంది. ఈ టికెట్లు పొందిన వారు జూలై 21 నుండి 23 వరకు మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్లో టికెట్లు మంజూరవుతాయని స్పష్టం చేసింది.
22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, వార్షిక పుష్పయాగం టికెట్లను జూలై 22న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను జూలై 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
23న అంగప్రదక్షిణం టోకెన్లను జారీ
అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూలై 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. అదేవిదంగా శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా విడుదల చేసే తేదీలపై కూడా టీటీడీ స్పష్టత ఇచ్చింది. శ్రీవాణి ట్రస్టు టికెట్ల ఆన్ లైన్ కోటాను జూలై 23 ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ఇక వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను జూలై 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో గదుల కోటా విడుదల పైనా టిటిడి స్పష్టత ఇచ్చింది. తిరుమల, తిరుపతిలో గదుల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఈ మేరకు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది.