భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి లండన్లో ఉన్నారు. ఇటీవల ఈ స్టార్ జంట వింబూల్డన్ 2025 లో జరిగిన ఒక హై-ప్రొఫైల్ టెన్నిస్ మ్యాచ్ చూడటానికి వచ్చారు. అక్కడ విరాట్ టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ కు సపోర్ట్ ఇస్తూ కనిపించాడు. మీడియా నివేదికల ప్రకారం, విరాట్-అనుష్క లండన్లోని సెయింట్ జాన్స్ వుడ్ ప్రాంతంలో ఉంటున్నారు. వింబూల్డన్ మ్యాచ్లు లండన్లోని ఆల్ ఇంగ్లాండ్ లాన్ టెన్నిస్, క్రోకెట్ క్లబ్లో జరుగుతున్నాయి. ఇది విరాట్ ఇంటికి చాలా దగ్గరలో ఉంది. అందుకే అతను మ్యాచ్ చూడటానికి వచ్చాడు. దీంతో అతను టీమిండియా మ్యాచ్ కూడా చూడటానికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
వాస్తవానికి, భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో మూడో మ్యాచ్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతుంది. ఈ మైదానం కూడా సెయింట్ జాన్స్ వుడ్లోనే ఉంది. ఇది కోహ్లీ ఇంటికి కొద్ది దూరంలోనే ఉంది. అందుకే అభిమానులు, ప్రస్తుతం భారత టెస్ట్ టీమ్లో లేని విరాట్, ఈ మ్యాచ్లో స్టాండ్స్ నుంచి తమ జట్టుకు సపోర్ట్ చేయడానికి వస్తాడని ఆశిస్తున్నారు. ఒకవేళ కోహ్లీ లార్డ్స్లో కనిపిస్తే అది ఆటగాళ్లకు మాత్రమే కాకుండా, అభిమానులకు కూడా ఉత్సాహకర వార్త అవుతుంది.
వింబూల్డన్ 2025 సందర్భంగా విరాట్ కోహ్లీ స్టార్ స్పోర్ట్స్ తో ప్రత్యేకంగా మాట్లాడాడు. ఈ సమయంలో తన కలల ఫైనల్ జకోవిచ్, రెండుసార్లు విజేత అయిన స్పానిష్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ మధ్య జరుగుతుందని కోహ్లీ చెప్పాడు. “కార్లోస్ అల్కరాజ్, నోవాక్ ఫైనల్కు చేరుకోవాలని, నోవాక్ టైటిల్ గెలవాలని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే అతని కెరీర్లో అది తనకు చాలా గొప్పగా ఉంటుంది” అని అన్నాడు.
ఇంకా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ.. ప్రతి ఆటలోనూ సవాళ్లు ఉంటాయి. క్రికెట్లో సవాళ్లలో ఒకటి ఏంటంటే చాలా కాలం వెయిల్ చేయాలి. మీరు ఉదయం వార్మ్-అప్ చేసి, ఆపై డ్రెస్సింగ్ రూమ్లో వెయిట్ చేస్తారు. ఎందుకంటే మీరు ఎప్పుడు బ్యాటింగ్ చేయబోతున్నారో తెలియదు. అక్కడ కూర్చుని ఆటను పరిశీలిస్తూ ఉండాలి. ఒక్కోసారి ఆట వేగంగా మారిపోతుంది. టెన్నిస్లో పరిస్థితులను ఎలా మార్చుకోవాలో ఎప్పటికప్పుడు మీరే నిర్ణయించుకుంటారు.అందుకే మీరు ఏం చేయబోతున్నారో మీకు అర్థం అవుతుంటుంది. వింబూల్డన్ సెంటర్ కోర్ట్లో ఆడడం క్రికెట్ స్టేడియంలో ఆడడం కంటే భయంకరమైన అనుభవంగా విరాట్ భావించాడు.