రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించినప్పటికీ ఈ ఏడాది ఆశించిన స్థాయిలో భారీ వర్షాల జాడ కనిపించడం లేదు. భారీ వర్షాల కోసం మరో రెండు వారాలు ఎదురుచూడాలని అంచనా వేసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది. ఉత్తరాదిన వర్షాలు ఊపేస్తుంటే.. దక్షిణాదిన మాత్రం బలమైన ఈదురుగాలులతో సరిపెట్టుకుంటుంది..
ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి ఛత్తీస్గడ్, మీదుగా దక్షిణ జార్ఖండ్ ప్రాంతంలోని అల్పపీడనం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. ఉత్తర చత్తీస్గడ్ మీదుగా విదర్భ వరకు సగటు సముద్ర మట్టం నుండి 3.1 కి మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాగల రెండు రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణ లోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఉత్తర భారత్లో మాత్రం నైరుతికి అనుకూలంగా ఉండటం వల్ల ఆయా రాష్ర్టాల్లో భారీ వర్షాలు, వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రుతుపవన ద్రోణి ప్రభావంతో జులై 14 వరకు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉన్నదని పేర్కొంది.
మరోవైపు ఏపీలో నేటి వాతావరణం ఎలా ఉండబోతుందంటే..?
పశ్చిమ అస్సాం నుంచి తెలంగాణ వరకు అల్పపీడన ద్రోణి విస్తరించి ఉంది. ప్రస్తుతం పశ్చిమ అస్సాం నుండి విదర్భ వరకు గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ మీదుగా, దక్షిణ జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. సగటు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఇది విస్తరించి కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గంటకు 40 -50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.