వికారాబాద్ జిల్లాలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. పరిగిలోని స్థానిక మహిళలు ఒక్కసారిగా పోస్టాఫీసు వద్ద పెద్ద ఎత్తున బారులు తీరారు. తెలంగాణ ప్రభుత్వం అందించే భాగ్యలక్ష్మీ స్కీం ద్వారా రూ. 2,500 నగదు జమ అవుతోందని స్థానికంగా వదంతులు రావడంతో.. వందలాది మహిళలు ఆ డబ్బులు తీసుకుందామని.. పోస్టాఫీసులో అకౌంట్లు తెరిచేందుకు ఉదయాన్నే అక్కడికి చేరుకున్నారు. చిన్న పిల్లల్ని సైతం పట్టుకుని లైన్లో నిల్చున్నారు.
అయితే ఇదంతా వట్టి పుకార్లు మాత్రమేనని.. భాగ్యలక్ష్మీ స్కీంకు సంబంధించిన ఎలాంటి సర్క్యూలర్ కూడా తపాలాశాఖకు రాలేదని.. సరైన సమాచారం కోసం ప్రజలు ప్రభుత్వ వెబ్సైట్లు, అధికారిక ప్రకటనలు ఫాలో అవ్వాలని తపాలా శాఖ సిబ్బంది కోరారు. అయితే తమ శాఖలో ఇలా అకౌంట్ల సంఖ్య పెరగడంతో సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.