సోషల్ మీడియాలో ఇతరులను కించపరుస్తూ, మనోభావాలను దెబ్బతీసే విధంగా దుష్ప్రచారం చేస్తూ అనుచిత పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వైరా ఏసీపీ రెహ్మాన్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెడితే ఇకపై ఉపేక్షించేది లేదని హెచ్చరించారు..
సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వైరా ఏసీపీ రెహ్మాన్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే పోస్టులు పెడితే ఉపేక్షించేది లేదని అన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా విద్వేషపూరిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టకూడదన్నారు. ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దుష్ప్రచారం చేసే వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాజకీయ, కుల, మత, ప్రాంతీయ వివాదాలకు తావు ఇచ్చేలా పోస్టులు పెట్టకూడదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఏదైనా పోస్టులు, వీడియోలు, ఫోటోలు పెట్టడం, వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఇతరుల మనోభావాలకు హాని కలిగించేలా ప్రవర్తించవద్దని అన్నారు. ఏదైనా వర్గాన్ని కించపరిచేలా సమాచారాన్ని పోస్ట్ చేయడం, షేర్ చేయడం రెండింటినీ నేరంగా పరిగణిస్తామన్నారు. అలాగే ఏదైనా వాట్సప్ గ్రూపులో ఇలాంటి పోస్టులు షేర్ అయితే, ఆ గ్రూప్ అడ్మిన్ కూడా బాధ్యుడిగా పరిగణిస్తామని అన్నారు.
సోషల్ మీడియాల్లో ఇలాంటి అనుచిత చర్యలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి.. 24/7 పర్యవేక్షణ వుంటుందని ఏసీపీ రెహ్మాన్ తెలిపారు. ఇలాంటి పోస్ట్లను ఫార్వర్డ్ చేసిన వారిపై కూడా కేసులు పెడతామన్నారు. సామాజిక మాధ్యమాలను సమాజానికి మంచిని చేసేందుకు మాత్రమే వినియోగించాలని హితవుపలికారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.