PM Kisan Scheme: దాదాపు అన్ని వర్గాల వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటిల్లో రైతులకు కూడా పీఎం కిసాన్ స్కీమ్ అందుబాటులో ఉంది. ఈ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా.. అర్హులైన లబ్ధిదారులకు పంట పెట్టుబడికి మద్దతు అందించేందుకు ఆర్థిక సాయం అందిస్తుంది. దీని కింద ప్రతి సంవత్సరం భూమి ఉన్న అర్హులైన రైతులకు రూ. 6 వేల చొప్పున అందిస్తుంటుంది. దీనిని ప్రతి 4 నెలలకు ఓసారి 3 విడతల కింద రూ. 2 వేల చొప్పున రైతుల అకౌంట్లలోనే నేరుగా వేస్తోంది. పీఎం కిసాన్ పంట సాయం మొత్తాన్ని రూ. 8 వేలకు పెంచాలనే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే.. ఈ బడ్జెట్లో కూడా పెంచుతారని వాదనలు వినిపించాయి.
అయితే జులై 23న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో రైతులకు నిరాశే ఎదురైంది. పీఎం కిసాన్ స్కీంపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. దీంతో ఒక్కొక్కరి అకౌంట్లో ఏటా రూ . 8 వేలు పడతాయనుకుంటే నిరాశే ఎదురైంది. ఈ నగదు మొత్తం పెంపు ప్రతిపాదన ఊసే లేదు.
ఈ స్కీం విషయానికి వస్తే ఇప్పటివరకు 17 విడతల్లో రైతులకు డబ్బులు అందాయి. అంటే మొదటి నుంచి అందుకున్న వారికి చేతికి రూ. 34 వేలు వచ్చాయి. ఇక త్వరలో 18వ విడత డబ్బులు రైతుల అకౌంట్లలో పడనున్నాయి. పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే ఇ- కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలి. ఇందుకోసం చాలా ఆప్షన్లే ఉన్నాయి. పీఎం కిసాన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఓటీపీ బేస్డ్ ఇ- కేవైసీ చేయించుకోవచ్చు. కామన్ సర్వీస్ సెంటర్లలో బయోమెట్రిక్ బేస్డ్ ఇ- కేవైసీ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ మొబైల్ యాప్లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.
పీఎం కిసాన్ స్టేటస్ కూడా ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్కు వెళ్తే అక్కడే బెనిఫిషియరీ స్టేటస్ పేజీ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి ఆధార్ నంబర్ లేదా అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. గెట్ డేటాపై క్లిక్ చేయాలి. వ్యూ బెనిఫిషియర్ స్టేటస్పై క్లిక్ చేసి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అక్కడ స్క్రీన్పై కనిపిస్తుంది. ఈ వెబ్సైట్లోనే న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, మొబైల్ నంబర్ అప్డేషన్ సహా ఇతర వివరాల్ని కూడా తెలుసుకోవచ్చు.