Kolkata Doctor Case Updates: మమతాపై నమ్మకం ఉండేది, కానీ..: వైద్యురాలి తండ్రి సంచలన వ్యాఖ్యలు

కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో హత్యాచారానికి గురైన జూనియర్ వైద్యురాలి తల్లిదండ్రులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కేసు దర్యాప్తులో పోలీసులు వ్యవహరించిన తీరు చూసి తమకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై నమ్మకం పోయిందని చెప్పారు. కనీసం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అయినా ప్రయత్నం చేస్తోందని వైద్యురాలి తండ్రి అన్నారు. తన కుమార్తె రాసుకున్న డైరీని సీబీఐ అధికారులకు అందజేశానన్న ఆయన.. అందులోని అంశాలను మాత్రం వెల్లడించడానికి నిరాకరించారు.

‘ముందు మమతా బెనర్జీపై నాకు పూర్తి నమ్మకం ఉండేది.. కానీ ప్రస్తుతం లేదు.. న్యాయం కావాలని ఆమె అడుగుతున్నారు కానీ ఆమె ఎందుకు అలా మాట్లాడుతోంది? ఆ బాధ్యత ఆమె తీసుకోవచ్చు, ఏమీ చేయడం లేదు.. మాకు న్యాయం కావాలి అని చెబుతున్నారు.. కానీ అదే మాట చెబుతున్న సామాన్య ప్రజానీకాన్ని లాక్కెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని ఫుట్‌బాల్ మ్యాచ్‌లో మద్దతుదారులపై లాఠీఛార్జ్‌ను పరోక్షంగా ప్రస్తావించారు.

ట్రెయినీ డాక్టర్ తల్లి మాట్లాడుతూ.. ‘మమతా బెనర్జీ పథకాలు కన్యాశ్రీ పథకం, లక్ష్మీ పథకం అన్నీ నకిలీవి. ఎవరైతే ఈ పథకాలను పొందాలనుకుంటున్నారో వాటిని పొందే ముందు మీ లక్ష్మి ఇంట్లో భద్రంగా ఉంది అని దయచేసి చూడండి’ రాష్ట్రంలోని మహిళలకు ఓ సలహా ఇచ్చారు. ఆగస్టు 8న రాత్రి డ్యూటీలో ఉన్న ట్రెయినీ వైద్యురాలు.. సెమినార్ హాల్‌లో నిద్రపోతున్న సమయంలో అత్యాచారానికి పాల్పడిన హత్య చేసిన విషయం తెలిసిందే. ఆమెపై శరీరంపై అనేక గాయాలున్నట్టు పోస్ట్‌మార్టమ్ నివేదికలో వెల్లడయ్యిందనే ప్రచారం జరిగింది. అయితే దీనిని పోలీసులు తోసిపుచ్చారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తోన్న సంజయ్ రాయ్ అనే పౌర వాలంటీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతురాలి పక్కనే అతడి బ్లూటూత్ సెట్ లభ్యం కావడంతో అదుపులోకి తీసుకున్నారు. అయితే, తల్లిదండ్రులు మాత్రం ఈ నేరం ఒక్కరు చేసింది కాదని అనుమానిస్తున్నారు. దీని గురించి ప్రశ్నించగా.. ‘ముందు నుంచి మేము అదే చెబుతున్నాం.. ఎంబీబీఎస్ వైద్యులు సహా మేము మాట్లాడినవారంతా ఒక్కరి వల్ల ఇంతటి ఘోరం జరగదని అన్నారు’ అని సమాధానం ఇచ్చారు.

తన కుమార్తె భద్రతకు బాధ్యత వహించిన వ్యక్తులు దానిని నిర్వర్తించడంలో విఫలమవడమే ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత విచారకరమైన విషయమని ఆయన అన్నారు. ‘తల్లిదండ్రులుగా మన బిడ్డ రోడ్డు మీద ఉన్నప్పుడు ఆందోళన చెందుతాం.. ఆమె తన పనిప్రదేశానికి చేరుకున్నప్పుడు అంతగా ఉండదు… ఆమెను స్కూల్ దగ్గర వదిలిపెట్టి గేట్ల లోపల ఉన్న తర్వాత ప్రశాంతంగా ఉంటాం.. రోడ్లపై సమస్య ఉండటంతో కుమార్తె కోసం కారును కూడా తీసుకున్నాం’ అని అన్నారు.

About amaravatinews

Check Also

టెట్ అభ్యర్ధులకు రైల్వేలో ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగిస్తూ ప్రకటన జారీ

టెట్ అర్హత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. దేశంలోని వివిధ రీజియన్లలో గ్రాడ్యుయేట్ టీచర్లు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *